
లండన్: ఇంగ్లండ్ పురుషుల జట్టులో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. జట్టులో మొత్తంగా ఏడుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇందులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన ఆటగాళ్లను ఇప్పటికే క్వారంటైన్కు తరలించినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా సోకిన ప్లేయర్స్ ఎవరో ఈసీబీ ప్రకటించలేదు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మిగిలిన ఆటగాళ్లు కూడా ఐసొలేషన్లో ఉన్నారు. పాకిస్తాన్తో వన్డే సిరీస్ ముందు కరోనా కేసులు బయపడ్డాయి.
ఆదివారం శ్రీలంక పర్యటన ముగిసింది. శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు, సిబ్బందికి సోమవారం ఈసీబీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. మంగళవారం రిపోర్ట్ రాగా.. ఏడుగురికి పాజిటివ్గా నిర్ధరణ అయింది. మిగతా టీమ్ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా వీళ్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఈసీబీ చెప్పింది. పాజిటివ్గా తేలిన ప్లేయర్స్, సపోర్టింగ్ స్టాఫ్ సభ్యులతో పాటు వాళ్లతో సన్నిహితంగా ఉన్న వాళ్లు కూడా ప్రస్తుతం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు.
ఇంగ్లండ్ బుధవారం నుంచి పాకిస్థాన్తో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే కార్డిఫ్లో జరగాల్సిన తొలి వన్డే షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఈసీబీ స్పష్టం చేసింది. దాంతో బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో కొత్త జట్టును ఎంపిక చేయాలని ఇంగ్లీష్ బోర్డు నిర్ణయించింది. త్వరలోనే మిగిలిన టీమ్ను కూడా ఈసీబీ ప్రకటించనుంది.
ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ మీడియాతో మాట్లాడుతూ... బయో సెక్యూర్ పరిస్థితులకు దూరంగా ఉండటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తాము ముందే ఊహించామన్నారు. గడిచిన 14 నెలల్లో ఆటగాళ్లు, సిబ్బంది ఎక్కువగా కఠిన పరిస్థితుల్లో గడిపినందున అందరి మంచి కోసం వైరస్ నిబంధనల్ని పాటించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు.