టీమిండియాలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా కూడా.. కొందరు ప్లేయర్లు సరిగ్గా అవసరమైన సమయంలో చేతులెత్తేస్తున్నారని, అందుకే ఈ టీం ఐసీసీ ట్రోఫీలు నెగ్గడంలో విఫలం అవుతోందని పాక్ మాజీ లెజెండ్ సల్మాన్ బట్ అన్నాడు. ఎంతో కాలంగా టీంలో ఉన్న సదరు ప్లేయర్ల నుంచి మంచి ప్రదర్శనలు ఆశిస్తారని, కానీ వాళ్లు మాత్రం నాకౌట్ మ్యాచుల్లో తేలిపోతున్నారని చెప్పాడు.
అనుభవం ఉన్న ఇలాంటి ప్లేయర్లు చేతులెత్తేయడం వల్లనే టీమిండియా విఫలం అవుతోందని అభిప్రాయపడ్డాడు. టీం కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ప్లేయర్ అని కొనియాడిన బట్.. మిగతా ప్లేయర్లలో కొందరు తమ ఆటతీరును మెరుగు పరుచుకోవాలని సూచించాడు. ముఖ్యంగా కీలకమైన నాకౌట్స్ మ్యాచుల్లో వీళ్లు రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.

'రోహిత్ శర్మ చాలా పెద్ద ప్లేయర్. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొందరు ప్లేయర్లు ఈ టీంలో చాలా కాలం నుంచి ఉంటున్నారు. మంచి అంతర్జాతీయ అనుభవం కూడా ఉంది. కానీ కీలకమైన మ్యాచుల్లో రాణించడం లేదు. ఒత్తిడికి తలొగ్గి ఫెయిలైపోతున్నారు. దీనిపైనే టీమిండియా ఫోకస్ పెట్టాల్సి ఉంది' అని బట్ చెప్పాడు.
అలాగే ఇషాన్ కిషన్కు టీమిండియాలో సరైన స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. వన్డేల్లో తను మంచి ఓపెనర్ అని కిషన్ ఇటీవలి కాలంలో నిరూపించుకున్నాడు. కానీ రోహిత్ శర్మ జట్టులోకి రాగానే అతను బెంచ్కే పరిమితం అవ్వాల్సి వస్తుందని బట్ అన్నాడు. తన సత్తా నిరూపించుకున్నా కూడా కిషన్ ఇలా బెంచ్పై కూర్చోవడం కరెక్ట్ కాదన్నాడు.
'డబుల్ సెంచరీ బాదినా తర్వాత కూడా ఒక ప్లేయర్ పక్కన కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ సెంచరీ చేసి లాభం ఏంటి? నువ్వు సెకండ్ ఆప్షన్ అనే విషయం అతనికి క్లియర్గా చెప్పేయాలి. ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు చేసినా ఇది మారదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల.. మనం ఎంత రాణించినా అవకాశాలు దక్కుతాయనే గ్యారంటీ లేకుండా పోతుంది' అని బట్ వివరించాడు.