హైదరాబాద్: వచ్చే వరల్డ్ కప్లో తన స్ధానానికి ఎలాంటి ఢోకా లేదని జట్టు మేనేజ్మెంట్ ధోనికి భరోసా కల్పించాలంటూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆ రకంగా ధోనికి హామీ ఇస్తేనే అతడు మరింత స్వేచ్ఛగా ఆడటానికి వీలుంటుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్య్వూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరిస్లో ధోని విఫలమైతే అతడి స్ధానంలో మరొకరికి చోటు కల్పిస్తామని టీమిండియా ఛీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సెహ్వాగ్ స్పందించాడు.

ఎమ్మెస్కే చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదని సెహ్వాగ్ ఈ సందర్భంగా సూచించాడు. 2019 వరల్డ్ కప్లో ఆడే తుది జట్టులో ధోని స్థానంపై భరోసా కల్పించాల్సింది టీమిండియా సెలక్టర్లేనని విషయం గుర్తుంచు కోవాలని సెహ్వాగ్ అన్నాడు.
'భారత జట్టు టాపార్డర్ విఫలమైతే అప్పుడు ధోని ఉపయోగం కచ్చితంగా కనబడుతుంది. భారత టాపార్డర్లో యువరాజ్, సురేశ్ రైనాల వంటి ఆటగాళ్లు విఫలమైన పక్షంలో ఆ తరువాత వచ్చే ధోని ఆదుకుంటాడు. దాన్ని చాలాసార్లు చూశాం కూడా. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న ధోని స్థానంపై జట్టు యాజమాన్యం భరోసా కల్పించాలి' అని సెహ్వాగ్ అన్నాడు.
2019 వరల్డ్ కప్ వరకూ ధోనికి నీ స్థానం నీదే అనే హామీ ఇచ్చి మరింత స్వేచ్ఛగా ఆడటానికి సెలక్టర్లు దోహదపడాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరొవైపు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాల స్థానాన్ని కూడా సెలక్టర్లు పరిశీలించాలని ఈ సందర్భంగా సెహ్వాగ్ సూచించాడు.