పుణే: భారత్ వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆధారంగా ఆటగాళ్లను టెస్టులకు, వన్డేలకు ఎంపిక చేయడం సరికాదని ధోనీ అభిప్రాయపడ్డాడు.
టీమిండియాలోకి ఎంపికయ్యేందుకు ఐపీఎల్లో ప్రదర్శన ప్రామాణికం కాదని ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో రోహిత్ శర్మ, అంబటి రాయుడు, శిఖర్ ధావన్, హార్ఢిక్ పాండ్యా, పవన్ నేగి, కరణ్ శర్మ, అశోక్ ధిండా, స్రాహ, బుమ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ప్రదర్శనే ప్రామాణికంగా జాతీయ జట్టులోకి ప్రవేశించిన నేపథ్యంలో ధోనీ వ్యాఖ్యలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ప్రధానంగా టెస్టులు, వన్డేల్లో ఆడేందుకు ఐపీఎల్ ప్రదర్శనను పట్టించుకోనక్కర్లేదని ధోనీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ వంటి టోర్నీలు ఆటగాడిలో ఉన్న ప్రతిభను చాటేందుకు మాత్రమే ఉపయోగపడతాయని ధోనీ అభిప్రాయపడ్డాడు.
ఇదే విషయం యువ ఆటగాళ్లకు తాను చెబుతుంటానని ధోనీ అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో రాణించడమే జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు సహకరిస్తుందని ధోనీ పేర్కొన్నాడు. ఐపీఎల్ ఆటతీరు ఆధారంగా టీమిండియా వన్డే, టెస్టు జట్టులో స్థానం కల్పించడం సరికాదన్నాడు.