ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం మహా సమరం మొదలుకానుంది. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 2న మొదలుకానున్న ఈ మెగాటోర్నీ అదే నెల 29న ముగుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్కు ఎంపికవ్వనున్న భారత జట్టుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో ఉత్కంఠ మొదలైంది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచకప్ జట్టును ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు ఇప్పటికే ఎంపిక చేశారు.
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో ముందడుగు వేసి టీ20 వరల్డ్ కప్లో బరిలోకి దిగే భారత తుదిజట్టును కూడా ప్రకటించాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు సెహ్వాగ్ జట్టులో చోటు కల్పించలేదు. ఫామ్ కోల్పోయిన హార్దిక్కు మొండిచేయి చూపించాడు. ఇటీవల ముంబై ఇండియన్స్పై అయిదు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మకు వీరూ అవకాశం ఇచ్చాడు.

రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యతలను సెహ్వాగ్ యశస్వీ జైస్వాల్కు ఇచ్చాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ను పక్కనపెట్టాడు. వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. స్టార్ క్రికెటర్ విరాట్ను అదే స్థానంలో కొనసాగించాలన్నాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చాడు. సర్జరీ తర్వాత సూర్య మునపటిలా ఫామ్లో లేనప్పటికీ సూర్యపై నమ్మకం ఉంచాడు.
అయిదో స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ను సెలక్ట్ చేశాడు. దీంతో వికెట్ కీపర్ రేసులో ఉన్న సంజు శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్కు సెహ్వాగ్ పరోక్షంగా చేదు వార్త చెప్పాడు. ఆరో స్థానంలో ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని రెండు పేర్లు సూచించాడు. రింకూ సింగ్, శివమ్ దూబెలో ఒకరి ఎంచుకోవాలని చెప్పాడు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్, సందీప్ శర్మ, అలాగే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాను ఎంపిక చేశాడు.
సెహ్వాగ్ ఎంపిక చేసిన భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రింకూ సింగ్/శివమ్ దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ.