న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గురువారం తనకు జరిగిన సన్మానం సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాను థ్యాంక్స్ చెప్పినవారి జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీని చేర్చుకోలేదు. మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేలకు, సచిన్ టెండూల్కర్కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
ధోనీ నాయకత్వంలో ఆరేళ్లు సెహ్వాగ్ ఆడాడు. అయినా ధోనీ పేరును ఆయన ప్రస్తావించలేదు. సెహ్వాగ్తో పాటు మైదానానికి తల్లి కృష్ణా సెహ్వాగ్, భార్య ఆరతి, ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ వచ్చారు. సెహ్వాగ్ చాలా సంక్షిప్తంగా ప్రసంగించారు.

బిసిసిఐ నుంచి డిడిసిఎ వరకు ప్రతి ఒక్కరికీ సెహ్వాగ్ ధన్యవాదాలు చెప్పారు. ఢిల్లీ అండర్ - 19 జట్టుకు తొలిసారి ఎంపిక చేసిన సతీష్ శర్మకు, తన తొలి కోచ్ ఎఎన్ శర్మకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. క్రికెట్ ఆడడానికి తనకు స్వేచ్ఛను ప్రసాందించిన తన తండ్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తన సన్నిహిత మిత్రులను కూడా సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. వారిలో ఢిల్లీ అండర్ -19 కోచ్ రాజు శర్మ ఉన్నాడు. కెప్టెన్లకు వచ్చేసరికి - తన తొలి కెప్టెన్ అజయ్ జడేజాకు, ఇతర కెప్టెన్లు సౌరవ్ గుంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నానని, అదే విధంగా సచిన్ టెండూల్కర్కు కూడా థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు .