న్యూఢిల్లీ : యురీ ఉగ్రవాద ఘటన పట్ల తన విచారాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు భారత డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. అమరులైన సైనికుల మృతదేహాలపై దేశ జాతీయ పతాకాన్ని కప్పి ఉంచిన ఫోటోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన సెహ్వాగ్.. '17 ప్రాణాలు, వాళ్లకు ఓ కుటుంబం ఉంది, ఓ కొడుకున్నాడు, ఓ కూతురు ఉంది, వారంతా దేశం కోసం సేవ చేసినవాళ్లు. ఇప్పుడీ ఫోటోను చూడడం అంతులేని వేదనకు గురిచేస్తోంది' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు సెహ్వాగ్.

ఇదిలా ఉంటే.. సెహ్వాగ్ ట్విట్టర్ పోస్టుల పట్ల స్పందించిన అబ్దుల్లా ఫ్రీడ్ అనే ఓ పాకిస్తాని.. మిమ్మల్ని అత్యంత గొప్పగా గౌరవిస్తున్నాని సెహ్వాగ్ ను ట్యాగ్ చేస్తూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సదరు పాకిస్తానీ ట్వీట్ పట్ల సానుకూలంగా స్పందించిన సెహ్వాగ్.. తనను గౌరవిస్తున్నందుకు అతగాడికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే ' ఏదైనా దేశం ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతుంటే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఆ దేశ ప్రజలపై ఉంటుందని అబ్దుల్లాకు సూచించాడు.