హైదరాబాద్: ఫిబ్రవరి 7... లెజెండరీ ఇండియన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే జీవితంలో మరిచిపోలేని రోజు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదే రోజున అనిల్ కుంబ్లే తన బౌలింగ్తో దాయాది దేశమైన పాకిస్థాన్పై రెచ్చిపోయి పదికి పది వికెట్లు తీసిన అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.
అది ఫిబ్రవరి 7, 1999వ సంవత్సరం... పాకిస్థాన్తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టె్సటు మ్యాచ్లో అనిల్ కుంబ్లే మ్యాజిక్ చేశాడు. ఈ అద్భుతంపై టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకొన్నాడు.
'అదృష్టం ముందు కుట్రలు పనిచేయవు. వెల్డన్ వసీమ్భాయ్. ఎలాంటి రోజది. కోట్లాలో అనిల్ భాయ్ది అద్భుత ప్రదర్శన' అంటూ ట్వీట్ చేశాడు.
ఈ టెస్టు మ్యాచ్లో పదో వికెట్గా వెనుదిరిగిన పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ క్రీడాస్ఫూర్తిపై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్లో కుంబ్లేకు పదో వికెట్ ఇవ్వకుండా తాను రనౌట్ అవుతానని వకార్ యూనిస్.. వసీమ్ అక్రమ్తో అన్నాడు. కుంబ్లేకు ఆ ఘనత సాధించడం రాసుంటే నువ్వు దాన్ని ఆపలేవని అప్పుడు వసీమ్ బదులిచ్చాడు.
అయితే చివరికి పదో వికెట్గా వసీమ్ అక్రమ్ వెనుదిరిగాడు. ఈ సంభాషణను సెహ్వాగ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మ్యాచ్ విశేషాల్లోకి వెళితే చివరి రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్కు 420 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. చేతిలో పది వికెట్లు ఉన్నాయి. చివరి రోజు క్రీజులో నిలబడితే టెస్టు డ్రాగా అవుతుంది.

ఈ టెస్టును పాకిస్థాన్ డ్రా చేసి ఉంటే అప్పటికే తొలి టెస్టులో గెలిచిన ఆ జట్టు సిరిస్ను కూడా నెగ్గేది. అయితే కుంబ్లే రూపంలో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్లో కుంబ్లే తన విశ్వరూపం చూపించాడు. నిజం చెప్పాలంటే మాయ చేశాడు. తొలి వికెట్కు 101 పరుగులతో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ జట్టును తన మాయాజలంతో తిప్పేశాడు.
తొలుత పటిష్టంగా కనిపించిన పాక్ ఆ తర్వాత 128 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాకిస్థాన్ బౌలర్ వసీం అక్రం కాస్త జట్టుని ఆదుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 207 పరుగుల వద్ద పాకిస్థాన్ చివరి వికెట్ను కోల్పోయింది. ఆ ఇన్నింగ్స్లో 74 పరుగులిచ్చిన కుంబ్లే 10 వికెట్లను సాధించి చరిత్ర సృష్టించాడు.