హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి తన పేలవమైన ప్రదర్శనతో టైటిల్ను సొంతం చేసుకోనటువంటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తన ప్రదర్శనను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను నియమించుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో బంగర్ నేతృత్వంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా సరే టైటిల్ బరిలో నిలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. దీంతో గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరుపున ఆడిన సెహ్వాగ్ను కోచ్గా నియమించడానికి కసరత్తులు చేస్తోంది.
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్గా ఉన్న సంజయ్ బంగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2014 నుంచి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు కోచ్గా ఉన్నారు. అతని నేతృత్వంలో 2014లో పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్ వరకూ వెళ్లగలిగింది. మిగతా సీజన్లలో పంజాబ్ జట్టు ఘోరంగా విఫలమైన లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.

దీంతో సంజయ్ బంగర్ గత నెలలో పంజాబ్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గత సీజన్లో పంజాబ్ జట్టు సహా యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో జరిగిన గొడవే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్గా సెహ్వాగ్ పేరును తెరపైకి వచ్చింది.
అయితే పంజాబ్ జట్టు కోచ్గా సెహ్వాగ్ని నియమించనున్నారంటూ వస్తున్న వార్తలపై జట్టు ప్రాంఛైజీ మాత్రం స్పందించలేదు. కాగా గత వారంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ జాన్సన్, ఆల్ రౌండర్ రిషి ధావన్, దక్షిణాఫ్రికా పేసర్ కేల్ అబ్బాట్లను ఫ్రాంజైజీ వదులుకుంది.