బెంగళూరు: ఇంగ్లండుతో మ్యాచుకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ భారత క్రికెట్ జట్టుకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఈ నెల 27వ తేదీన ఇంగ్లండుతో వన్డే మ్యాచు జరుగనున్న నేపథ్యంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. గాయం తీవ్రత ఏ మేరకు ఉందనేది నిర్ధారణ కావాల్సి ఉంది. గాయం కారణంగా సెహ్వాగ్ ప్రాక్టీస్ మధ్యలో వైద్య పరీక్ష కోసం బయటకు వెళ్లిపోయాడు. జహీర్ ఖాన్ వేసిన బంతికి సెహ్వాగ్ గాయపడ్డాడు. గురువారం ఉదయం యువరాజ్ సింగ్ గాయపడిన విషయం తెలిసిందే. యువరాజ్ ఎడమ చేతికి గాయమైంది. అయితే, అది చిన్న గాయమేనని అంటున్నారు. ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా ఫేవరైట్ జట్టుగా రంగంలో ఉంది. ఈ స్థితిలో కొంత మంది కీలకమైన ఆటగాళ్లకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూడా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నాడు. అయితే, అది ప్రమాదకరమైంది కాదని తేలింది.