
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మొత్తం 195 దేశాల్లో 170 దేశాలకు వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం వరకు మృతుల సంఖ్య 13,444కు చేరగా.. వైరస్ సోకిన కేసుల సంఖ్య 3,08,130గా నమోదైంది. శనివారం నుంచి 1,702 కొత్త మరణాలు, 28,674 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 35 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దాదాపు అన్ని దేశాలు సరిహద్దులను మూసేసి అంతర్జాతీయ విమానాల సర్వీసులను రద్దు చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్న కఠిన ఆంక్షలు విధించాయి.
ఒకవైపు కరోనా వేగంగా వ్యాపితున్నా.. మరోవైపు వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం ఎందరో పనిచేస్తున్నారు. వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం పనిచేస్తున్న యోధులకు టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధన్యవాదాలు తెలిపాడు. 'విరామం లేకుండా పనిచేస్తున్న యోధులందరికీ పెద్ద వందనం. భవిష్యత్తులో పరిస్థితులు సర్దుకుంటాయని ఆశిస్తున్నా. ఓం శాంతి' అని ట్వీటాడు. కరోనా వ్యాప్తి నిర్మూలనకుకు చేపట్టిన 'జనతా కర్ఫ్యూ'లో యావత్ భారత్ పాల్గొన్న విషయం తెలిసిందే.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జనతా కర్ఫ్యూపై స్పందించాడు. 'డాక్టర్లు, నర్సులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు, సీఐఎస్ఎఫ్, రసాయన శాస్త్రవేత్తలు ఇలా ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జనతా కర్ఫ్యూలో యావత్ భారత్ పాల్గొంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. ఇతరుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి' అని హర్భజన్ ట్వీట్ చేశాడు.
'ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని నయం చేయడానికి భూమాత ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొద్ది కాలంలోనే మన జీవనశైలిని మార్చుకునేలా చేసింది. వాతావరణ మార్పులను సరిదిద్దే చర్యలలో మనం ఎప్పుడూ అలసత్వం వహిస్తూ వచ్చాం. కానీ.. మన అందరం కలిసి చేసే పనులను రివర్స్ చేసి.. తనని తాను భూమాత నయం చేసుకుంటోంది' అని ఓపెనర్ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.