హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించకపోయినా దాని నుంచి బయటపడి ఎలా విజృంభించాలో అతడికి బాగా తెలుసని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
'ఫామ్ను కోల్పోవడం ప్రతి క్రికెటర్ కెరీర్లోనూ జరుగుతుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రతి సంవత్సరం ఒకేలా ఆడలేదు. మీడియా ప్రశ్నలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సమయంతో పాటే ఫామ్ కూడా మారుతుంది' అని సెహ్వాగ్ చెప్పాడు.

చెత్త ప్రదర్శన నుంచి మళ్లీ మంచి ప్రదర్శన చేయడం అనేది మంచి ఆటగాడికి హాల్ మార్క్ లాంటిదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే దీనిని ఎలా అధిగమించాలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి బాగా తెలుసని 92.7 బిగ్ ఎఫ్ఎం చానల్ నిర్వహించిన కార్యక్రమంలో సెహ్వాగ్ పలు ప్రశ్నలకు బదులిచ్చాడు.
ఐపీఎల్ పదో సీజన్లో 9 మ్యాచ్లాడిన కోహ్లీ 27 సగటుతో ఇప్పటివరకు మొత్తం 250 పరుగులు చేశాడు. ఇందులో కోహ్లీ అత్యధిక స్కోరు 64. జూన్ 1వ తేదీ నుంచి ఇంగ్లండ్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు కోహ్లీయే నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సెహ్వాగ్ మాట్లాడుతూ టీ20లు ఆడినంత మాత్రాన మళ్లీ 50 ఓవర్ల వన్డే మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని అన్నాడు. ఐపీఎల్ పదో సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సెహ్వాగ్ మెంటార్గా కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుందా లేదా అనేది ఇతర జట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలిపాడు. పూణె, హైదరాబాద్, కోల్కతా మూడు జట్లు ఓడిపోతే తమకు ప్లే ఆఫ్లో బెర్తు దక్కే చాన్స్ ఉంటుందని సెహ్వాగ్ చెప్పాడు.
మరోవైపు తమ జట్టు రన్రేట్ కూడా ఎక్కువగా ఉండాలని, అప్పుడే క్వాలిఫై అవుతామని సెహ్వాగ్ తెలిపాడు. పంజాబ్ తన చివరి మ్యాచ్లో భాగంగా మే 14 (ఆదివారం) పూణె జట్టుతో తలపడుతుంది.