ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబైకి ఈ సీజన్లో తొమ్మిదో ఓటమి. 13 మ్యాచ్లు ఆడిన ముంబై ఎనిమిది పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
అయితే వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఏడు వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42; 21 బంతుల్లో, 6x4,2x6) టాప్ స్కోరర్. బుమ్రా (2/39), పీయూష్ చావ్లా (2/28) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది.

ఇషాన్ కిషన్ (40; 22 బంతుల్లో, 5x4, 2x6), తిలక్ వర్మ (32; 17 బంతుల్లో, 5x4, 1x6) పోరాడారు. వరుణ్ చక్రవర్తి (2/17), రసెల్ (2/34), హర్షిత్ రాణా (2/34) తలో రెండు వికెట్లు తీశారు. రోహిత్ శర్మ (19; 24 బంతుల్లో, 1x4, 1x6), సూర్యకుమార్ యాదవ్ (11; 14 బంతుల్లో, 1x4) స్లో ఇన్నింగ్స్ ఆడారు. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన నమన్ ధిర్ (17; 6 బంతుల్లో, 1x4, 2x6) మెరిశాడు.
కాగా, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కేకేఆర్-ముంబై మ్యాచ్ గురించి విశ్లేషిస్తూ రోహిత్-సూర్య ఔటైన తీరును విమర్శించాడు. బౌలర్ను గౌరవించకపోయినా, కనీసం బంతిని అయినా గౌరవించాలని అన్నాడు. అయితే రోహిత్, సూర్య గొప్ప బ్యాటర్లని, కానీ అహంతో బ్యాటింగ్ చేయొద్దని సూచించాడు. చక్రవర్తి బౌలింగ్లో రోహిత్, రసెల్ బౌలింగ్లో సూర్య ఔటయ్యారు.
''ఎవరైతే బాగా బౌలింగ్ చేస్తారో, వాళ్లతో జాగ్రత్తగా ఆడాలి. రోహిత్, సూర్య ఔట్ కాకపోతే ముంబై ఓ ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించేది. వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్, రసెల్, హర్షిత్ రాణా బౌలింగ్లో పరుగులు సాధించారు. కానీ స్పిన్నర్ల చేతిలో వికెట్లు కోల్పోకుండా ఉండి ఉంటే, మ్యాచ్ను గెలిచేవారు. అయితే బ్యాటింగ్కు వచ్చినప్పుడు అహంతో ఆడకూడదు. చెత్త బంతుల్ని మాత్రమే శిక్షించాలి''
''ఆఖర్లో నమన్ ధిర్ వచ్చాడు. రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆ సమయంలో రోహిత్, సూర్య కుదురుకుని క్రీజులో ఉండి ఉంటే, అయిదు బంతుల్ని బౌండరీకి తరలించేవారు. అయితే మీరు రోహిత్ శర్మ, సూర్యకుమార్ కావొచ్చు. మీరు బౌలర్ను గౌరవించకపోవచ్చు. కానీ కనీసం మంచి బంతుల్ని అయినా గౌరవించాలి. రోహిత్ ఔటైన బంతి అంత సులువైనది కాదు. రోహిత్, సూర్య గొప్ప ప్లేయర్లే. దానిలో ఎలాంటి సందేహం లేదు. అలా అనీ, మంచి బంతుల్ని కూడా హిట్టింగ్ చేయమని కాదు'' అని సెహ్వాగ్ అన్నాడు.