
హైదరాబాద్: పెద్దవాళ్లు సాధారణంగానే ఏదో ఒక విషయం చెప్పి భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలానే భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ను క్రికెట్ ఆడితే.. పెళ్లి కాదని ఏడిపించారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. ఇలా ఆమెను ఏడిపించింది కూడా ఆమె తాతయ్య, నానమ్మలేనట. ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పుకొచ్చారు.
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న ఆమె.. ఈ క్రికెట్ కెరీర్ గా ఎంచుకోవడం తన తండ్రి కోరిక అని పేర్కొన్నారు. ఇంకా మంచి డ్యాన్సర్ అవ్వాలనేది వాళ్లమ్మ కోరికట. 'నన్ను మంచి డ్యాన్సర్ చేయాలని మా అమ్మకు ఉండేది. క్రికెట్ ఆడటం మొదలు పెట్టకముందు ఎప్పటి నుంచో డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్లో నా ఫస్ట్ ఛాయిస్ డ్యాన్స్కే. డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసేదాన్ని.'
'కొన్ని కారణాల వల్ల క్రికెట్ నా కెరీర్లో తప్పనిసరైంది. ఆ రోజుల్లో క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం సవాలుతో కూడుకున్నదే. క్రికెటర్ అవ్వాలని అనుకుంటున్నట్లు చెబితే తాతయ్య, నానమ్మ నమ్మలేదు. మా కుటుంబంలో ఎవరూ క్రీడాకారులు లేదు. మగవాళ్లతో కలిసి క్రికెట్ ఆడేందుకు మా తాతయ్య, నానమ్మలు అంగీకరించారు. ఎవరూ నిద్రలేవక ముందే లేచి ప్రాక్టీస్కు వెళ్లేదాన్ని. తిరిగి సాయంత్రం వచ్చేదాన్ని'
ముఖమంతా.. జిడ్డుగా మారేది. అక్కడక్కడా పగుళ్లు కూడా వచ్చేవి. రెండు మూడు గాయాలు కూడా అయ్యాయి. అవి చూసి మా తాతయ్య-నానమ్మలు నన్ను ఏడిపించేవారు. క్రికెట్ ఆడటానికి వెళ్లి ఇలా తయారైతే.. నిన్ను పెళ్లి చేసుకోడానికి ఎవరూ ముందుకు రారు అని ఆటపట్టించేవారు' అని చెప్పింది మిథాలీ. గత ఏడాది వన్డే ప్రపంచకప్లో మిథాలీ ఆరు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కూడా మిథాలీ రెండు వేల పరుగుల క్లబ్లో చేరింది.