
హైదరాబాద్: గురువారం ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇచ్చి ముంబైకి చేరుకున్న కొత్త పెళ్లి జంట విరాట్ కోహ్లీ-అనుష్కశర్మలకు ఘన స్వాగతం లభించింది. వీరిద్దరూ ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో విరుష్క అభిమానులు ఘన స్వాగతం పలికారు.
డిసెంబర్ 11న ఇటలీలో పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా ఈ జోడీ ముంబైకి రావడంతో విమానాశ్రయంలో అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. అనుష్క వెంట ఆమె తల్లిదండ్రులు అజయ్ కుమార్ శర్మ, అషీమా శర్మ, సోదరుడు కర్నేష్ శర్మ ఉన్నారు.
కోహ్లీ-అనుష్క శర్మలను చూడగానే కెమెరాలు, సెల్ఫోన్లలో బంధించారు. డిసెంబర్ 26న ముంబైలో అటు బాలీవుడ్ ఇటు క్రికెటర్లకు విందు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూసేందుకు గాను విమానాశ్రయం నుంచి నేరుగా రిసెప్షన్ ఇవ్వనున్న సెయింట్ రెజీస్ హోటల్కు చేరుకున్నారు.
ఇదిలా ఉంటే గురువారం రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్లోని దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని మోడీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.