

హైదరాబాద్: తీవ్ర విమర్శలు, భారీ అంచనాలతో సఫారీ పర్యటనకు పూనుకున్న భారత్... రెండు సిరీస్లను చేజిక్కుంచుకుని భారత్కు తిరిగొచ్చింది. ఈ పర్యటనలో ఆఖరిదైనటువంటి టీ 20ని విజయంతో ముగించాలని ఇరు జట్లు తహతహలాడాయి. ఈ హోరాహోరీ సమరంలో గెలిచేది ఎవరా అనే ఉత్కంఠతో సగటు క్రీడాభిమాని మ్యాచ్ను చూస్తూ ఉండిపోయాడు.
తత్ఫలితంగా వీక్షకులు సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయిందట. తాజాగా ఓ సర్వే ప్రకటించిన ఫలితాల్లో ఈ మ్యాచ్ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కోహ్లీ సేన సఫారీ గడ్డపై పర్యటించింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. మొదట టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఆ తర్వాత పుంజుకుని వరుసగా వన్డే, టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ఫిబ్రవరి 18న ఫ్రారంభమైంది.
జొహాన్నెస్బర్గ్లో జరిగిన మ్యాచ్లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫిబ్రవరి 21న రెండో మ్యాచ్. ఇది గెలిస్తే సిరీస్ భారత్ వశం. కానీ, అప్పటికే వన్డే సిరీస్ కోల్పోయి, తొలి టీ20లో పరాజయం పాలైన సఫారీ జట్టు ఎలాగైన సిరీస్ను సమం చేయాలనుకుంది. దీంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
సఫారీ గడ్డపై కోహ్లీ సేన ఆడిన అన్ని మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్కు 25శాతం వీక్షకుల సంఖ్య ఎక్కువగా నమోదైందని సర్వే తెలిపింది. మిగతా అన్ని క్రీడలతో పోలిస్తే క్రికెట్ను ప్రత్యక్ష ప్రసారం చేసే బ్రాడ్కాస్టర్స్కు కాసుల వర్షం కురుస్తోందని సర్వే ప్రతినిధులు తెలిపారు. క్రికెట్ తర్వాత ఫుట్బాల్ను ఎక్కువగా వీక్షిస్తున్నారని సదరు మీడియా సంస్థ పేర్కొంది.