అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కూడా స్కామర్లు వదల్లేదు. ఈ సంస్థను మోసం చేసి రూ.20 కోట్లపైగా సొమ్ము కాజేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. అమెరికాకు చెందిన స్కామర్లు ఈ మోసం చేసినట్లు సమాచారం. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ ఈ సంస్థకు టోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కు మెయిల్ చేశారట.
ఆ మెయిల్లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్తోనే ఐసీసీకి టోపీ వేశారట.
ఇలా మొత్తం 2.5 మిలియర్ డాలర్ల సొమ్మును కాజేశారట. ఈ బ్యాంకు అకౌంట్ నెంబర్లు మారడాన్ని ఐసీసీ ఫైనాన్స్ విభాగంలో ఎవరూ గమనించకపోవడంతోనే ఇంత పెద్ద మోసం సులువుగా జరిగిపోయింది. ఈ విషయంపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. ఎఫ్బీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు. మనం నమ్మే వాళ్ల మెయిల్ వంటి మెయిల్ ఐడీతోనే మోసం స్కామర్లు మోసం చేస్తే దాన్ని బీఈసీ మోసం అంటారట. ఇప్పుడు ఐసీసీ వంటి అంతర్జాతీయ సంస్థే ఇలా మోసపోవడం చూసిన క్రీడాభిమానులు నోరెళ్లబెడుతున్నారు. కొందరైతే దీనిపై జోకులు పేలుస్తున్నారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో ఎప్పుడూ ఆటగాళ్ల జీతంలో కోతలు వేసే ఐసీసీకి ఇప్పుడు తన జీతంలోనే కోత పడిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఆన్లైన్ యుగంలో జాగ్రత్తగా లేకుంటే ఎంత పెద్ద సంస్థకైనా తిప్పలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.