హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసుని ఎదుర్కొంటున్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కి సుప్రీంకోర్టు నుంచి విముక్తి లభించింది. అనురాగ్ ఠాకూర్ చెప్పిన బేషరతు క్షమాపణని సుప్రీంకోర్టు అంగీకరించింది.
జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలు కోసం బీసీసీఐలో కాగ్కి చెందిన వ్యక్తిని సుప్రీంకోర్టు నియమించడం ప్రభుత్వ జోక్యం కిందకు వస్తుందా? అని అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఐసీసీకి లేఖ రాశారు. ఈ విషయం బయటికి రావడంతో ఐసీసీకి లేఖ రాశారా? అని అనురాగ్ ఠాకూర్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇందుకు అనురాగ్ ఠాకూర్ లేదని చెబుతూ తప్పుడు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. దీనిపై ఐసీసీ సీఈఓ రిచర్డ్సన్ని ప్రశ్నించగా.. బీసీసీఐ లేఖ రాసింది వాస్తమేనని అయితే ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సుప్రీంకోర్టుకి ఆయన సమాధానమిచ్చారు.
దీంతో తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేయడంతో పాటు బీసీసీఐలో జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలను అమలు చేసేందుకు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహించిన సుప్రీం కోర్టు ధిక్కారం కింద విచారణను చేపట్టింది. కోర్టు ధిక్కారం కింద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది.
దీనిపై కొన్ని రోజుల క్రితం అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే దీనిపై సంతృప్తి వ్యక్తం చేయని అత్యున్నత న్యాయస్థానం స్వయంగా కోర్టుకు హాజరై మరోసారి సవివరంగా క్షమాపణలు తెలియజేయాలని ఆదేశించింది.
దీంతో 'న్యాయస్థానాన్ని ధిక్కరించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. భాషా పరంగా, సమాచార లోపంతో అనుకోకుండా కొన్ని తప్పులు జరిగాయి. అందుకే మరోసారి భేషరుతుగా, నిస్సందేహంగా క్షమాపణలు చెబుతున్నా' అని కోర్టుకు అతని తరఫున న్యాయవాది పీఎస్ పట్వాలియా గురువారం అఫిడవిట్ను దాఖలు చేశాడు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఠాకూర్పై విచారణను నిలిపివేసింది.