ఐపీఎల్-2024 సీజన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. 200 స్కోరు సాధిస్తే అది సాధారణమే అనిపిస్తోంది. 250+ స్కోరు బాదితేనే ఆ జట్టుకు గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఫ్లాట్ పిచ్ అని కొందరు, ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏమైనప్పటికీ ఇది బౌలర్లకు ప్రధాన సవాలుగా మారుతుందని, ఆల్రౌండర్లకు ప్రతికూలంగా ఉందని ప్రముఖ క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం బౌలర్లకు మరింత మద్దతు పెరుగుతోంది. బ్యాటుకు, బంతికి మధ్య సమానమైన పోటీ ఉండేలా ఆట నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది.

ఈడెనెగార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన కేకేఆర్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. అంతేగాక 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఆరు వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54), శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఈ మ్యాచ్ గురించి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు.'ఎవరైనా బౌలర్లను కాపాడండి'అని పేర్కొన్నాడు. దీనికి మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్పందిస్తూ..'ఆ దేవుడే కాపాడాలి'అంటూ బదులిచ్చాడు. ఈ టాప్ స్పిన్నర్ డిమాండ్కు మద్దతుగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు. బీసీసీఐకి ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేశాడు. 'ఇది బౌలర్లకు అంత ఈజీ కాదు. భవిష్యత్లో దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. బ్యాట్-బాల్ మధ్య పోటీ సమానంగా ఉండాలి' అని గంగూలీ పేర్కొన్నాడు.