
అహ్మదాబాద్: చేతేశ్వర్ పుజారా.. నిఖార్సయిన్ టెస్ట్ ప్లేయర్. క్రీజ్లో పాతుకునిపోవడం అతని నైజం. సుదీర్ఘ ఇన్నింగ్ను ఆడే సామర్థ్యం అతని సొంతం. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్కు బ్యాటింగ్ శైలి ఏ మాత్రం అతకదు అనే విమర్శలు సైతం పుజారాపై ఉన్నాయి. అందుకే వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్లో కనిపించడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లోనూ అతన్ని జట్టులోకి తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఇష్టపడదు. అతని వైపు మొగ్గు చూపదు.
కారణాలు ఏవైనప్పటికీ- సిరీస్కు కూడా దూరం అయ్యాడు చేతేశ్వర్ పుజారా. శ్రీలంకతో జరిగే సిరీస్కు అతణ్ని ఎంపిక చేయలేదు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ. అతని పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. టెస్టుల్లో కూడా చోటు కల్పించలేదు. పుజారాతో పాటు మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానె, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాలను కూడా దూరం పెట్టింది. వీరంతా మళ్లీ జాతీయ జట్టులోకి చోటు దక్కించుకోవాలంటే రంజీల్లో రాణించాల్సి ఉంటుందని సెలెక్టర్లు తేల్చి చెప్పారు.
దీన్ని సవాల్గా తీసుకున్నట్లు కనిపించాడు పుజారా. శ్రీలంక సిరీస్ ఆడబోయే టీమిండియా జట్టును ప్రకటించిన మరుసటి రోజే అతను సత్తా చాటడం మొదలు పెట్టాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో ముంబైపై భారీ స్కోర్ సాధించాడు. ఈ మ్యాచ్ను టీ20 ఫార్మట్లో ఫటాఫట్ ధనాధన్ స్టైల్లో ఆడేశాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో పుజారా 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, 16 ఫోర్లు ఉన్నాయి.
తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు పుజారా. బంతిని గ్రౌండ్కు నలువైపులా పరుగులు పెట్టించాడు. ముంబై బౌలర్లను చితగ్గొట్టాడు. 109.64 స్ట్రైక్రేటును నమోదు చేశాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన పుజారా క్రీజ్లో పాతుకు పోయాడు. జట్టు స్కోరు 271 పరుగులు ఉన్న సమయంలో అవుట్ అయ్యాడు. ములానీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్లో అయిదు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.