
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో నేడు జరిగిన రెండు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ల్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ఏ జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ, కేరళ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాలను సౌరాష్ట్ర, సర్వీసెస్ జట్లు సునాయసంగా చేధించి సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.
చెలరేగిన ప్రేరక్ మన్కడ్
నేడు జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర, విదర్భ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ.. సౌరాష్ట్ర బౌలర్ల ధాటికి 40.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో వాంఖడే ఒక్కడే దాదాపు సగం స్కోర్ చేశాడు. 5 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులతో చెలరేగాడు. మిగతావారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, జాని, డీఏ జడేజా, చూడసమా రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రేరక్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు. ఇక 151 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 29.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రేరక్ మన్కడ్ 77 పరుగులతో అజేయంగా నిలిచి సౌరాష్ట్రను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. విదర్భ బౌలర్లలో ఆదిత్య థాకరే 2, లలిత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
రవి చౌహాన్ సెంచరీ మిస్
కేరళ, సర్వీసెస్ మధ్య జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో మొదట కేరళ బ్యాటింగ్ చేసింది. సర్వీసెస్ బౌలర్లు విజృంభించడంతో 40.3 ఓవర్లలో ఆ జట్టు 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ కున్నుమ్మల్ 85 పరుగులతో చెలరేగినప్పటికీ మిగతా వారెవరూ అతనికి సహకారం అందించలేదు. మిడిలార్డర్ బ్యాటర్ మనోహరన్ 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. సర్వీస్ బౌలర్లలో దివేష్ పఠానియా 3 వికెట్లు తీయగా.. అభిషేక్ తివారి, పుల్కిత్ నారంగ్ రెండేసి వికెట్లు తీశారు. రాహుల్సింగ్, రాజ్ బహుదూర్ తలో వికెట్ తీశారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు 30.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
దీంతో 7 వికెట్ల తేడాతో ఘనవియం సాధించి.. సర్వీసెస్ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సర్వీసెస్ బ్యాటర్లలో ఆ జట్టు ఓపెనర్ రవి చౌహాన్ 90 బంతుల్లో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్జుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. సర్వీసెస్ కెప్టెన్ రజత్ పలివాల్ 65 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచాడు. కాగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నెగ్గి హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్టు విజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. వీటికి తోడు నేడు సర్వీసెస్, సౌరాష్ట్ర జట్లు కూడా సెమీఫైనల్కు చేరుకున్నాయి.