ఇరానీ కప్-2024లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో అజేయ ద్విశతకంతో చెలరేగిన టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతలు సాధించాడు. భారత క్రికెట్లో పాటు ప్రపంచ క్రికెట్లోనూ పలు రికార్డులు కైవసం చేసుకున్నాడు. సర్ఫరాజ్ 286 బంతుల్లో అజేయంగా 222 పరుగులు చేశాడు. 25 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
149 బంతుల్లో శతకం సాధించిన సర్ఫరాజ్, 253 బంతుల్లో డబుల్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచి స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అయితే సహచరులు వరుసగా పెవిలియన్కు చేరడంతో ముంబై ఆలౌటైంది. దీంతో సర్ఫరాజ్ 250 మార్క్ను సాధించలేకపోయాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ అరుదైన ఘనత సాధించాడు.

ఇరానీ కప్లో అత్యధిక పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ అయిదో స్థానంలో నిలిచాడు. రవిశాస్త్రి, యశస్వీ జైస్వాల్ను అధిగమించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో వసీమ్ జాఫర్ (విదర్భ) అగ్రస్థానంలో ఉన్నాడు. 2018లో రెస్టాఫ్ ఇండియాపై 286 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో మురళీ విజయ్ (రెస్టాఫ్ ఇండియా- 266, 2012లో రాజస్థాన్పై), ప్రవీణ్ తాంబే (రెస్టాఫ్ ఇండియా- 246, 1990లో బెంగాల్పై)
సురీందర్ అమర్నాధ్ (ఢిల్లీ- 235*, 1980లో రెస్టాఫ్ ఇండియాపై), సర్ఫరాజ్ ఖాన్ (ముంబై- 221*, 2024లో రెస్టాఫ్ ఇండియాపై), రవిశాస్త్రి (రెస్టాఫ్ ఇండియా- 217, 1990లో బెంగాల్పై), యశస్వీ జైస్వాల్ (రెస్టాఫ్ ఇండియా- 213, 2023లో మధ్యప్రదేశ్పై) వరుసగా ఉన్నారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అత్యధిక సగటు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సర్ఫరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్ (95.14 సగటు), విజయ్ మర్చంట్ (71.64), యశస్వీ జైస్వాల్ (70.47), సర్ఫరాజ్ ఖాన్ (69.2), జార్జ్ హెడ్లీ (69.86) టాప్-5లో ఉన్నారు. కాగా, సర్ఫరాజ్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగుల భారీ స్కోరు చేసింది. అజింక్య రహానె (97) సెకండ్ టాప్ స్కోరర్.