
టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చేందుకు తలుపులు బద్దలు కొడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. ముంబై తరఫున రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఈ కుర్రాడు భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో అతనికి అవకాశం ఇస్తారని అంతా భావించినా అది జరగలేదు. ఇక ఆస్ట్రేలియా సిరీసులో అయినా ఆడిస్తారనుకుంటే అక్కడా సెలెక్టర్లు అతనికి మొండి చెయ్యే చూపించారు. ఇప్పుడు దేశవాళీల్లో కీలక సిరీస్ అయిన ఇరానీ ట్రోఫీలో కూడా అతను ఆడటం లేదని తెలుస్తోంది.
ఇరానీ ట్రోఫీలో అతను రెస్టాఫ్ ఇండియా తరఫున ఆడతాడని అంతా భావించారు. కానీ అతన్ని ఈ జట్టులో ఆడించడం లేదని తెలుస్తోంది. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్, రెస్టాఫ్ ఇండియా జట్లు తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఆడటం లేదని సమాచారం. అతని వేలికి గాయమైందని, అందుకే అతను ఈ మ్యాచ్లో ఆడటం లేదని సమాచారం. కాగా, ఈ టోర్నీలో రెస్టాఫ్ ఇండియా జట్టుకు కర్ణాటక స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ నాయకత్వం వహిస్తాడట.
ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. కేవలం ఆరు మ్యాచుల్లోనే 556 పరుగులు చేశాడు. అతని సగటు 92.66 కావడం గమనార్హం. ఈ టోర్నీలో అతను మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాదాడు. అయితే అతను ఇరానీ ట్రోఫీలో ఆడుతుందీ, లేనిదీ అధికారికంగా బీసీసీఐ ప్రకటించలేదు. ఇంకా రెస్టాఫ్ ఇండియా జట్టును కూడా ప్రకటించలేదు. కానీ వేలి గాయం కారణంగా సర్ఫరాజ్ ఈ జట్టుకు దూరమైనట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అతను మంచి అవకాశాన్ని కోల్పోయినట్లే అని చెప్పాలి. అయితే మయాంక్ అగర్వాల్ కూడా రంజీ సీజన్లో అదరగొట్టాడు. దీంతో ఐపీఎల్లో అతనిపై అందరి కళ్లూ పడతాయి. సన్రైజర్స్ ఓపెనర్గా ఆకట్టుకుంటే అతనికి మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వచ్చినా రావొచ్చు.