బెంగళూరు: యువ బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ కారణంగానే ఐపిఎల్-9లో మంగళవారం జరిగిన మ్యాచులో తాము ఓడిపోయామని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. చివరి ఓవర్లలో విజృంభించిన సర్ఫరాజ్.. తమ నుంచి మ్యాచ్ ను దూరం చేశాడని అన్నాడు.
చివరి రెండు ఓవర్లలో సర్ఫరాజ్ చేసిన పరుగులే మ్యాచ్లో కీలకంగా మారాయని డేవిడ్ వార్నర్ తెలిపాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడారని కొనియాడాడు.
గతి తప్పి చెత్త బంతులు వేసిన బౌలర్లతో తాను మాట్లాడకపోవడం కూడా ఓటమికి ఓ కారణమేనని చెప్పాడు. సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయపటం కూడా తమపై ప్రతికూల ప్రభావం చూపిందని వాపోయాడు. తమ ఓటమికి తాను ఏ ఒక్కరినీ తప్పు బట్టడం లేదని, లోపాలను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్ లో బరిలోకి దిగుతామని వార్నర్ తెలిపాడు.

కాగా, సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శన పట్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచులో సర్ఫరాజ్ ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. కేవలం 10 బంతుల్లోనే 35 పరుగులు చేసి అదరగొట్టాడని చెప్పాడు.
చెలరేగిన కోహ్లీ, డివిలియర్స్.. చివర్లో సర్ఫరాజ్: హైదరాబాద్ చిత్తు
తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం జరిగిన మ్యాచ్ని 45 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఎబి డివిలియర్స్ కేవలం 42 బంతుల్లోనే 82 పరుగులు చేసి బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 బంతులు ఎదుర్కొని 75 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో సర్ఫ్రాజ్ 10 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 35, జాధవ్ 6 బంతుల్లో 8 చొప్పున పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
సన్రైజర్స్ బౌలర్లలో ముస్త్ఫాజుర్, భువనేశ్వర్ కుమార్ చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన హైదరాబాద్ ఓటమిపాలైంది.
బెంగళూరును ఓడించడానికి 228 పరుగులు సాధించాల్సిన సన్రైజర్స్ 35 పరుగుల స్కోరువద్ద శిఖర్ ధావన్ వికెట్ను కోల్పోయింది. అతను ఎనిమిది పరుగులు చేసి పర్వేజ్ రసూల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. చెలరేగిపోయిన డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మోజెస్ హెన్రిక్స్తో కలిసి రెండో వికెట్కు అతను 5.3 ఓవర్లలో 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
కేవలం 25 బంతులు ఎదుర్కొన్న వార్నర్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 58 పరుగులు సాధించి, షేన్ వాట్సన్ బౌలింగ్లో ఆడం మిల్నే క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. మొదటి ఓవర్లో 19 పరుగుల సమర్పించుకున్న యజువేంద్ర చాహెల్కు మరో ఓవర్ను ఇచ్చి కెప్టెన్ కోహ్లీ చేసిన ప్రయోగం ఫలించింది. నమన్ ఓఝా (0)ను అతను డివిలియర్స్ క్యాచ్ పట్టగా అవుట్ చేశాడు.
అంతకు ముందు ఓవర్లో ఒక వికెట్ కూల్చిన వాట్సన్ను తప్పించి ఆడం మిల్నేను బౌలింగ్కు దించి కోహ్లీ మరో ప్రయోగం చేశాడు. అది కూడా సఫలమైంది. క్రీజ్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న మోజెస్ హెన్రిక్స్ (19)ను పర్వేజ్ రసూల్ క్యాచ్ పట్టగా మిల్నే అవుట్ చేశాడు. దీపక్ హూడా, ఇయాన్ మోర్గాన్ క్రీజ్లో ఉండగా, 11.1 ఓవర్లలో సన్రైజర్స్ వంద పరుగుల మైలురాయిని చేరింది.
మరో రెండు బంతులకే హూడా అవుటయ్యాడు. అతను ఆరు పరుగులు చేసి యజువేంద్ర చాహల్ బౌలింగ్లో డివిలియర్స్కు దొరికిపోయాడు. 18 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసిన ఆశిష్ రెడ్డిని షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇయాన్ మోర్గాన్ (నాటౌట్ 22), కర్న్ శర్మ (నాటౌట్ 26) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడినప్పటికీ, జట్టును లక్ష్యానికి చేర్చలేకపోయారు.