టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించి ఎట్టకేలకు టీమిండియా తలుపు తట్టిన సర్ఫరాజ్కు ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కని విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోవడంతో అతడు వేలానికి వచ్చాడు.
కానీ ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ సర్ఫరాజ్పై ఆసక్తి చూపలేదు. పేస్, స్పిన్ను దూకుడుగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించే సామర్థ్యం ఉన్న అతడి కోసం ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే వేలం తర్వాత సర్ఫరాజ్ టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు. అనంతరం అతనికి డిమాండ్ పెరిగింది.

ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో రాణించిన సర్ఫరాజ్ను రిప్లేస్మెంట్తో దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అయితే ఈ రేసులో అందరి కంటే ముందు గుజరాత్ టైటాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
రాబిన్ మింజ్ స్థానంలో సర్ఫరాజ్ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ కోసం గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.6 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే సర్ఫరాజ్ కోసం గుజరాత్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని సమాచారం.
26 ఏళ్ల సర్ఫరాజ్ మూడు టెస్టుల్లో అయిదు ఇన్నింగ్స్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ఒకసారి నాటౌట్గా నిలిచాడు. ఐపీఎల్లో 37 ఇన్నింగ్స్ల్లో 22 సగటుతో 585 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరఫున 2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ పంజాబ్ కింగ్స్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా ఆడాడు. సర్ఫరాజ్ రెడ్ బాల్ క్రికెట్కు బాగా సరిపోతాడని, టీ20లు అతనికి అంత నప్పవని, అందుకే ఢిల్లీ వదులుకుందని ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది.