టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. రంజీట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. విదర్భతో కర్ణాటక, ముంబయితో బరోడా, సౌరాష్ట్రతో తమిళనాడు, మధ్యప్రదేశ్తో ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే ముంబయి తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిన్న తొలి సెంచరీ బాదిన ముషీర్ ఖాన్ ఇవాళ దాన్ని ద్విశతకంగా మలిచాడు.
బీకేసీ గ్రౌండ్లో బరోడాతో జరుగతున్న క్వార్టర్ ఫైనల్లో ముంబయి 384 పరుగులకు ఆలౌటైంది. ముంబయి జట్టు సాధించిన స్కోరులో సగానికిపైగా ముషీర్ ఖాన్ సాధించాడు. సహచరులు విఫలమవుతున్నా కష్టాల్లో ఉన్న జట్టును 18 ఏళ్ల ముషీర్ ఖాన్ వన్ మ్యాన్ షోతో ఆదుకున్నాడు. 357 బంతుల్లో అజేయంగా 203 పరుగులు చేశాడు. 18 ఫోర్లు బౌండరీలు బాదాడు.

పృథ్వీ షా (33; 46 బంతుల్లో), అజింక్య రహానె (3; 13 బంతుల్లో) వంటి స్టార్ క్రికెటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ ముషీర్ ఖాన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. సాధికారికంగా ఆడుతూ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. వికెట్ కీపర్ హార్దిక్ (57; 248 బంతుల్లో)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.
ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో ముషీర్ ఖాన్ భారత్ తరఫున సెంచరీల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాస్త విరామం తీసుకున్న అతడు.. ఇప్పుడు తిరిగి రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి అదరగొడుతున్నాడు. అయితే గత రంజీ సీజన్లో ముషీర్ ఖాన్ ముంబయి జట్టు నుంచి తప్పించారు.
2022 డిసెంబర్లోనే ముషీర్ ఖాన్ అరంగేట్రం చేశాడు. అప్పుడు మూడు మ్యాచ్ల్లో 19.20 సగటుతో 96 పరుగులే చేశాడు. దీంతో అతడికి కాస్త సమయం ఇవ్వాలని పక్కనపెట్టారు. ఇప్పుడు రీఎంట్రీలో అదరగొడుతున్నాడు.మరోవైపు అతడి సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ రాజ్కోట్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధశతకాలు సాధించి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.