
రంజీ - 2022 సీజన్లో ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ఆడిన 6 మ్యాచ్లలో 982పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని సర్ఫరాజ్ ఖాన్ గెలుచుకున్నాడు. ఇకపోతే ఈ అవార్డు దక్కించుకున్న అనంతరం సర్ఫరాజ్.. ప్రతిరోజూ తన ఆటలో మెరుగ్గా కావడానికి ఎలా ప్రయత్నించాడో.. తన వెన్నంటి నిలిచింది ఎవరో తదితర విషయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇకపోతే ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన అతను ఈ క్రెడిట్ అంత తన తండ్రికి దక్కుతుందని తెలిపాడు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుంటూ సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడాడు. 'నేను ఇప్పుడు ఈ అవార్డు అందుకున్నానంటే అక్కడ నిలబడి ఉన్న మా నాన్నగారి క్రెడిట్ ఇదంతా. నేను క్రీజులో ఎక్కువ సేపు నిలబడ్డానికి, వీలయినన్ని పరుగులు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడటానికి ప్రయత్నిస్తాను. నా కెరీర్లో ఎలాంటి ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నానో చాలా మందికి తెలుసు. ఇలాంటి టైంలో నా వెన్నంటి మా నాన్న ఉన్నాడు. మా నాన్న లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మా దగ్గర సరిపడా డబ్బులు లేనప్పడు క్రికెట్ జర్నీల కోసం నేను మా నాన్నతో కలిసి రైళ్లలో ప్రయాణించేవాడిని. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఎలాగైనా సరే నేను రంజీ ట్రోఫీలో ముంబై తరఫున సెంచరీ సాధించాలని కలలు కన్నాను. అది నెరవేరింది' అని పేర్కొన్నాడు.
ఇకపోతే రంజీ ట్రోఫీ ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్లో కీలకమైన సెంచరీని సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ముంబైకి గౌరవప్రదమైన స్కోరు అందించడంలో తోడ్పడ్డాడు. రంజీల్లో రాణిస్తున్న తనకు ఫైనల్లో కూడా సెంచరీ చేయాలనే కల ఉండేదని, దాన్ని కూడా సాధించానని అతను తెలిపాడు. 'జట్టు అవసరాల్లో ఉన్నప్పుడు ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించి నా కల నెరవేర్చుకున్నాను. అందుకే నా సెంచరీ తర్వాత నేను అంతా ఉద్వేగానికి లోనయ్యాను. నా కళ్లలో నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా నాకంతా గుర్తుకొచ్చింది. ఎందుకంటే మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. ఈ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది. అతను లేకుంటే నేను జీరో. ఈ క్రికెట్ జర్నీలో మా నాన్న నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు' అని కాస్త ఎమోషనల్ అయ్యాడు సర్ఫరాజ్.