|
గత చరిత్రను మర్చిపోండి.. సానుకూల దృక్పథంతో ఆడండి
ప్రపంచకప్లో ఇప్పటిదాకా పాకిస్తాన్ జట్టు టీమిండియాపై ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ రెండు జట్లు మొత్తం ఆరుసార్లు తలపడగా.. అన్ని మ్యాచుల్లోనూ భారత జట్టే విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఈ చెత్త రికార్డును మరిచి పోవాలని, సానుకూల దృక్పథంతో మ్యాచ్ ఆడాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. తాను కేరీర్ను ఆరంభించే సమయానికి 70 శాతం విజయావకాశాలను 30 శాతం ప్రతిభను కొలమానంగా తీసుకునే వారని, తాను రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి ఈ శాతం 50-50కి చేరిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో 60 శాతం మానసిక దృఢత్వం, 40 శాతం ప్రతిభ ఉండాలని అన్నారు. ఈ విషయంలో తన స్నేహితుడు సునీల్ గవాస్కర్ ప్రకటనను తాను ఏకీభవిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
|
మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది..
భారత్, పాక్ జట్ల ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ఇమ్రాన్ చెప్పారు. అచంచలమైన ధృడసంకల్పమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని అన్నారు. సర్ఫరాజ్ అహ్మద్ వంటి ఆటగాడు జట్టు కేప్టెన్గా ఉండటం తమ అదృష్టమని, ఆ అదృష్టాన్ని ఆయన విజయంగా మార్చుకోవాలని సూచించారు. ప్రతికూల దృక్పథంతో మ్యాచ్ను ఆడితే తప్పులు, పొరపాట్లు దొర్లుతాయని ఇమ్రాన్ అన్నారు. మానసిక దృఢతాన్ని ఏర్పరచుకోవాలని, ఒత్తిడిని తరిమి కొట్టాలని చెప్పారు. అలాంటప్పుడే విజయం సిద్ధిస్తుందని హితవు పలికారు.
|
చివరి బంతి వరకూ పోరాడండిః
ప్రస్తుతానికి భారత్ హాట్ ఫేవరెట్గా కనిపిస్తోందని, అయినప్పటికీ.. అద్భుతాలు చేయగల సత్తా, శక్తి సామర్థ్యాలు సర్ఫరాజ్ టీమ్కు ఉందని ఇమ్రాన్ అన్నారు. చివరి బంతి వరకు, చివరి పరుగు వరకూ పోరాటాన్ని సాగించాలని ఆయన తమ దేశ జట్టుకు ఉత్తేజితులను చేశారు. పాకిస్తాన్ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటోందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ పరాజయాన్ని దరి చేయనివ్వొద్దని అన్నారు.