ఎంతైనా మేనమామ కదా!
ఉత్తర్ ప్రదేశ్లోని ఇటావాలో నివసిస్తోన్న మహబూబ్ హసన్ అనే ఓ వృద్ధుడి పరిస్థితీ అంతే. పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లో భారత్ ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటోన్న ఆ వృద్ధుడు.. పాకిస్తాన్ కేప్టెన్ సర్ఫరాజ్ మాత్రం చెలరేగిపోవాలని, బాగా ఆడాలని ఆశిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆ వృద్ధుడు..సర్ఫరాజ్ అహ్మద్కు స్వయానా మేనమామ. అలాగని- ఏ వేలు విరిచిన బంధుత్వమో కాదు. స్వయానా మేనమామే. సర్ఫరాజ్ అహ్మద్ తల్లి మహబూబ్ హసన్కు సోదరి.
పాక్లో మంచి ఆటగాళ్లు లేరు..
దాయాది జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరని మహబూబ్ హసన్ అభిప్రాయ పడ్డారు. జట్టులో ఇప్పుడు ఆడుతున్న వారికి పెద్దగా అనుభవం లేదని, ఒత్తిడికి ఇట్టే తలొగ్గుతారని అన్నారు. తన మేనల్లుడి జట్టులో మంచి బౌలర్లు ఉన్నారని కితాబిచ్చారు. ప్రతి మ్యాచ్నూ గెలవాలనే సానుకూల దృక్పథంతో ఆడటం మంచిదేనని, అలాగని ప్రతి మ్యాచ్నూ గెలవడం సాధ్యం కాదని చెప్పారు. బౌలర్లు శ్రమిస్తేనే.. ఏ జట్టుకైనా విజయం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. ఎవరి ఆటతీరు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్లో తన మేనల్లుడు సర్ఫరాజ్ బాగా ఆడాలని, టీమిండియాపై మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే- భారత్ గెలవాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నట్లు చెప్పారా పెద్దాయన.
టీమిండియాలో అత్యుత్తమం..
కోహ్లీసేనలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని హసన్ అన్నారు. నాణ్యమైన బౌలర్లు, బ్యాట్స్మెన్లతో టీమ్ మొత్తం నిండిపోయి ఉందని, ప్రతికూల పరిస్థితుల నుంచి జట్టును ఒడ్డున పడేయగల నిఖార్సయిన బ్యాట్సమెన్లు, బౌలర్లు జట్టులో ఉన్నారని చెప్పారు. భారత క్రికెట్ జట్టుతో పాకిస్తాన్ టీమ్ను పోల్చుకోలేమని అన్నారు. భారత జట్టులో బౌలర్లు విఫలమైతే.. భారీ స్కోర్లు సాధించడానికి బ్యాట్స్మెన్లు ఉన్నారని చెప్పారు. ప్రత్యర్థి జట్టుకు భారీ స్కోరును లక్ష్యంగా నిర్దేశించగలిగితే.. భారత బౌలర్లు తమ పని తాము చేసుకెళ్తారని అన్నారు. పాకిస్తాన్లో బౌలింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ.. దూకుడును ప్రదర్శిస్తోన్న భారత బ్యాట్స్మెన్లను కట్టడి చేసేంత స్థాయిలో లేదని ఆయన మహబూబ్ హసన్ అభిప్రాయ పడ్డారు.