
స్వింగ్ బౌలర్ను ఆడించరా?:
ఆదివారం శరణ్దీప్ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'భువనేశ్వర్ కుమార్ను ఇంగ్లండ్కు తీసుకుకెళ్లకపోవడం అతిపెద్ద తప్పు. భారత జట్టులోని ఉత్తమ స్వింగ్ బౌలర్ అతను. కనీసం ఆ పర్యటనలో ఒకడిగానైనా ఎంపికచేయలేదు. శార్ధూల్ ఠాకూర్ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడించలేదు. ఎప్పుడూ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాపైనే ఆధారపడొద్దు. మూడు ఫార్మాట్లలో అతనెప్పుడు ఫిట్గా తయారవుతాడో, ఎప్పుడు బౌలింగ్ చేస్తాడో తెలియదు. అలాంటప్పుడు శార్ధూల్ లేదా విజయ్ శంకర్ లేదా శివమ్ దూబేను తయారు చేయాలి' అని అన్నారు.

సిరాజ్కు అవకాశాలు ఇవ్వాలి:
'ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్లో ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి ఉంటుంది. మొహ్మద్ సిరాజ్కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడించి ప్రోత్సహించాలి. అతనిప్పుడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒకవేళ అతడికి ఎప్పుడో ఒకసారి అవకాశాలిచ్చి రాణించమంటే ఇబ్బంది పడతాడు. అప్పుడు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. రాబోయే సిరీస్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించినా.. పరిస్థితులను బట్టి అదనపు పేసర్ను కూడా తీసుకోవాలి' అని శరణ్దీప్ సింగ్ సూచించారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సిరాజ్ ఆడలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీసుల్లో సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

సమస్య బ్యాట్స్మెన్దే:
భారత బౌలింగ్ విభాగం బాగుందని, సమస్య బ్యాట్స్మెన్దేనని శరణ్దీప్ పేర్కొన్నారు. 'శుభ్మన్ గిల్ స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్లోనూ రాణించలేదు. ఛాంపియన్షిప్ ఫైనల్లో మొదట కాస్త బాగా ఆడినా.. తర్వాత పెద్ద స్కోర్లు సాధించలేకపోయాడు. దాంతో ఇప్పుడతను బాధ్యత తీసుకొని ఒత్తిడిని తట్టుకోవాలి. పుజారా, రహానె లాంటి ఆటగాళ్లు ఎప్పుడూ ఒకేలా ఆడకుండా.. పరిస్థితులకు తగ్గట్టు మారాలి. ఆస్ట్రేలియా పర్యటనలోనూ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెనే కీలక పరుగులు చేశారు. కోహ్లీ, రోహిత్లపై భారం తగ్గించే ఆటగాళ్లు కావాలి. కోహ్లీ సారథ్యంలోని భారత్ కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నా ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోయింది. విజేతగా నిలవడానికి కోహ్లీసేనకు అన్ని అర్హతలున్నా.. ఏదో ఒక కారణంతో అది జరగడం లేదు' అని శరణ్దీప్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












