
దూస్రాని సంధించేందుకు భయపడిపోయా:
రెండు టెస్ట్ సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా 1999లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో సచిన్ వికెట్ని ఆఖర్లో పడగొట్టిన సక్లైన్ ముస్తాక్.. పాక్కి 12 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. అప్పటి మధుర స్మృతులను ఆదివారం స్పోర్ట్స్టార్తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో సక్లైన్ గుర్తుచేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఆరోజు సచిన్ వికెట్ని నేను తీస్తానని ఊహించలేదు. మా కెప్టెన్ వసీమ్ అక్రమ్ నేను ఏదో చేస్తానని నమ్మి.. నా చేతికి బంతినిచ్చాడు. అప్పటికే నా బౌలింగ్లో సచిన్ కొన్ని బౌండరీలు బాదాడు. దాంతో అతనికి దూస్రాని సంధించేందుకు భయపడిపోయా' అని సక్లైన్ చెప్పాడు.

గర్వంగా ఫీలవుతా:
'మ్యాచ్లలో బౌలర్ విసిరే ప్రతి బంతినీ సచిన్ నిశితంగా పరిశీలిస్తూ షాట్ కొడుతుంటాడు. బంతి గమనాన్ని బట్టి షాట్ ఎంచుకుంటాడు. అతని వికెట్ తీయడం చాలా కష్టం. అయితే ఎట్టకేలకి సచిన్ వికెట్ని పడగొట్టగలిగా. పిచ్ స్లోగా ఉండటం కూడా నాకు ఆరోజు కలిసొచ్చింది. మొత్తంగా నా చివరి శ్వాస వరకూ సచిన్ వికెట్ని ఆ మ్యాచ్లో పడగొట్టినందుకు గర్వంగా ఫీలవుతా' అని సక్లైన్ ముస్తాక్ చెప్పుకొచ్చాడు. సక్లైన్ పాక్ తరఫున 49 టెస్టులు, 169 వన్డేలు ఆడాడు.

సచిన్ అద్భుత సెంచరీ:
చెన్నై మ్యాచ్లో 272 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ ఒకానొక దశలో 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఆట చూస్తే ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపించింది. కానీ.. సచిన్ టెండూల్కర్ ఒంటరి పోరాటం చేసి అద్భుత సెంచరీ (136)తో మళ్లీ భారత్ జట్టులో గెలుపు ఆశలు రేపాడు. నయాన్ మోంగియా (52)తో కలిసి పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ సమయంలో పాక్ కెప్టెన్కు ఏంచేయాలో అర్ధం కాలేదు. సచిన్ని నిలువరించేందుకు ఆఖరి అస్త్రంగా ముస్తాక్ని ప్రయోగించాడు. భారత్ జట్టు విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో సచిన్ పెవిలియన్ చేరడంతో పాక్ విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications
