దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజ శాంసన్ శతకంతో చెలరేగాడు. రెడ్ బాల్ క్రికెట్లో వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ 94 బంతుల్లో సెంచరీ సాధించాడు. 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగాడు. అనంతపురం వేదికగా ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. దులీప్ ట్రోఫీలో శాంసన్ ఇండియా-డీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సంజు శాంసన్కు ఇది 11వ సెంచరీ. అయితే తొలుత దులీప్ ట్రోఫీలో సంజు శాంసన్కు చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్కు గాయమవ్వడంతో ఇండియా-డీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి రౌండ్ మ్యాచ్లో తుదిజట్టులో అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనూ సంజు శాంసన్ బెంచ్కే పరిమితం అయ్యాడని ట్రోల్స్ వచ్చాయి. మొత్తంగా రెండో రౌండ్లో తుదిజట్టులో అవకాశం దక్కించుకున్నాడు. కానీ రీఎంట్రీలో శాంసన్ నిరాశపరిచాడు. 5, 40 పరుగులకే పరిమితమయ్యాడు.

కానీ ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్లో సత్తాచాటాడు. స్వల్ప వ్యవధిలోనే జట్టు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ నిలకడగా పరుగులు చేశాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే సెంచరీ అందుకున్న అనంతరం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నవదీప్ సైని బౌలింగ్లో షాట్కు యత్నించి నితీశ్ కుమార్ రెడ్డి చేతికి చిక్కి 106 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
ప్రస్తుతం ఇండియా-డీ పటిష్ట స్థితిలో ఉంది. 84 ఓవర్లకు 331/8తో నిలిచింది. క్రీజులో సౌరభ్ కుమార్, అర్షదీప్ సింగ్ ఉన్నారు. శాంసన్ (106) శతకం సాధించగా, రికీ భుయ్ (56), శ్రీకర్ భరత్ (52), దేవదత్ పడిక్కల్ (50) అర్ధశతకాలు సాధించారు. ఇండియా-బీ బౌలర్లలో నవదీప్ సైని నాలుగు వికెట్లు, రాహుల్ చాహర్ మూడు వికెట్లు తీశాడు.