
మేమిద్దరం మంచి స్నేహితులం:
తాజాగా సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'జట్టు కూర్పును బట్టే చోటు లబిస్తుంది. పంత్ను నేనెప్పుడూ పోటీగా భావించలేదు. ఇంకొకరిని పోటీగా భావిస్తూ ఆటలో కొనసాగడం కష్టం. ఢిల్లీ డేర్డెవిల్స్లో పంత్, నేను కలిసి ఆడటం ఆరంభించాం. మేమిద్దరం మంచి స్నేహితులం. అతడో మంచి ఆటగాడు. కలిసి ఆడటాన్ని మేమిద్దరం ఆస్వాదిస్తాం. అతడితో కలిసి ఎన్నో ఇన్నింగ్స్లు ఆడాను. గుజరాత్ లయన్స్తో ఆడిన మ్యాచ్ నాకు గుర్తుంది. ఇద్దరం సిక్సర్ల వర్షం కురిపించాం. 200 పరుగులకు పైగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించాం. పంత్తో పోటీ గురించిన చర్చ వచ్చినప్పుడల్లా.. అతడితో కలిసి ఆడడం గురించే నేను ఆలోచిస్తా' అని అన్నాడు.

పంత్ను నేనెప్పుడూ పోటీగా భావించలేదు:
'రిషబ్ పంత్తో పోటీ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు మేమిద్దరం కలిసి ఆడటాన్ని ఊహించుకుంటాను. ఆడటమే కాదు మేమిద్దరం చాలా సరదాగా ఉంటాం. ఇద్దరం కలిసి బౌలర్లను చితకబాదేందుకు ఇష్టపడతాం. గతంలో ఆ పని చాలాసార్లు చేశాం. ఎప్పుడైనా అతడితో కలిసి ఆడేందుకే ఎదురుచూస్తాను. పోటీగా భావించను' అని శాంసన్ చెప్పాడు. 'జట్టులో రెండోసారి చోటు దక్కేంత వరకు దేశవాళీ క్రికెట్లో ఎన్నో అంశాలు నేర్చుకున్నా. ధోనీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అతనాడుతున్న రెండు మ్యాచులను టీవీలో చూసినా ఎన్నో తెలివితేటలు వస్తాయి. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండే మహీని చూసి ఎంతో నేర్చుకోవచ్చు' అని ఈ కేరళ కీపర్ అంటున్నాడు.

వెంటనే ఒప్పుకున్నా:
'2013 ఐపీఎల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. రాహుల్ భాయ్, జుబిన్ భారుచ (ప్రాంఛైజీ చీఫ్) రాజస్థాన్ రాయల్స్కు ట్రయల్స్ నిర్వహించారు. అప్పుడు నేను మంచి ఇన్నింగ్స్ ఆడాను. రెండో రోజు ముగిశాక.. రాహుల్ భాయ్ నా వద్దకొచ్చాడు. నా జట్టులో ఆడతావా అని అడిగాడు. నా యదలో వేయి వీణలు మోగినట్లు అనిపించింది. కల నిజమైన భావనతో వెంటనే ఒప్పుకున్నా' అని సంజూ శాంసన్ తెలిపాడు.

కేవలం నాలుగు టీ20లు:
ఎంఎస్ ధోనీకి వారసుడిగా అందరూ అనుకున్న రిషబ్ పంత్ స్థాయికి తగ్గట్టు రాణించలేక జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్నాడు. పరిమిత ఓవర్లలో లోకేష్ రాహుల్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకాగా.. టెస్టులో వృద్దిమాన్ సహా నుంచి గట్టి పోటీ ఉంది. మరోవైపు ఐపీఎల్లో కొన్నేళ్లుగా రాణిస్తున్నా.. శాంసన్కు జట్టులో సరైన అవకాశాలు దక్కడం లేదు. శాంసన్ భారత్ తరపున కేవలం నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు.


Click it and Unblock the Notifications












