
ఈ ఐపీఎల్లో తమపై బాగా ఒత్తిడి ఉంటుందని రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ చెప్పాడు. గతేడాది అద్భుతంగా రాణించిన ఈ జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరింది. కానీ చివరి మెట్టుపై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ చిన్న లక్ష్యాన్ని గుజరాత్ చాలా ఈజీగా ఏడు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు అవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ చేరుకున్న ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్.. జట్టు గురించి మాట్లాడాడు. గతేడాది అద్భుతంగా రాణించిన తమ జట్టు ఈ ఏడాది కూడా అదే మాదిరి రాణించాల్సిన అవసరం ఉందని శాంసన్ చెప్పాడు. అయితే అంతకన్నా బెటర్గా ఆడాల్సి ఉంటుందని, కనీసం గతేడాదిలాగే ఫైనల్ అయినా చేరాలని చెప్పుకొచ్చాడు. తనకు ఈ జట్టుతో చాలా గొప్ప అనుబంధం ఉందని, రాజస్థాన్ ఎప్పుడూ సూపర్గా రాణించాలనే తాను కోరుకుంటానని చెప్పాడు.
'నేను 18 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్లో చేరాను. ఇప్పుడు నా వయసు 28. ఈ పదేళ్లు నా జీవితంలో ఒక గొప్ప జర్నీ. ఇది నా జట్టు. ఎప్పుడూ ఆర్ఆర్ రాణిస్తుంటే చూడాలని కోరుకుంటా. గతేడాది సాధించిన ఫీట్ను ఈ ఏడాది కూడా సాధించాలనే ఒత్తిడి మాపై ఉంటుంది. మేం ఈసారి కప్పు కొట్టాలని, లేదంటే కనీసం మరోసారి ఫైనల్ చేరాలని అభిమానులు ఆశిస్తారు. కాబట్టి మా దగ్గర మరో ఆప్షన్ లేదు' అని చెప్పుకొచ్చాడు.
తమకు సంగక్కర వంటి కోచ్ దొరకడం నిజంగా అదృష్టమని సంజూ అభిప్రాయపడ్డాడు. ఈ టీం బౌలింగ్ కోచ్గా లసిత్ మలింగ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గతేడాది రాజస్థాన్ జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరడంలో ఓపెనర్ జోస్ బట్లర్ పాత్ర చాలా కీలకం. ఆ ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన బట్లర్ చివరకు ఆరెంజ్ క్యాప్తో సీజన్ ముగించాడు. ఈ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా పర్పుల్ క్యాప్తో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది కూడా వీళ్లిద్దరూ రాజస్థాన్ రాయల్స్కు కీలకం కానున్నారు.