RR vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా 59వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు గొప్ప ఆరంభం లభించింది. 220 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టుకు చెందిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 50 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 40 పరుగులు చేశారు. దీని తర్వాత కూడా రాజస్థాన్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఓటమి తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక ప్రకటన చేశాడు.
సంజూ శాంసన్ ఏం అన్నాడంటే?
రాజస్థాన్ జట్టు ఓటమి అనంతరం మాట్లాడుతూ.. తాము ఇన్నింగ్స్ను బాగా ప్రారంభించామని సంజూ శాంసన్ అన్నాడు. ఇంతకంటే ఏమీ ఆశించలేమన్నారు. పవర్ ప్లేలో సాధించిన ఊపును కొనసాగించలేకపోయామని అంగీకరించాడు. వికెట్, ఔట్ ఫీల్డ్ను పరిగణనలోకి తీసుకుంటే ఇది సాధించగలిగే టార్గెట్ అని సంజూ శాంసన్ చెప్పాడు. బ్యాటింగ్ లైనప్, పవర్ హిట్టర్లతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తాము భావించామన్నారు. రాజస్థాన్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని.. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని.. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఆట గెలవడమే మా తొలి ప్రాధాన్యత అంటూ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున నేహాల్ వధేరా 37 బంతుల్లో 70 పరుగులు చేశాడు. వధేరాతో పాటు శశాంక్ సింగ్ కూడా 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ధ్రువ్ జురేల్ కూడా 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అయితే ఇది విజయానికి సరిపోలేదు.