
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి సంజూ శాంసన్ తప్పుకోవాల్సి వచ్చింది. సీనియర్లు లేని సమయంలో జట్టులో కీలకమైన ఆటగాళ్లలో సంజూ ఒకడు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో కేవలం ఐదు పరుగులే చేసి పెవలియన్ చేరాడు. మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను టైమింగ్ మిస్ అయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగా అక్కడున్న ఫీల్డర్ దాన్ని సులభంగా అందుకున్నాడు.
ఆ తర్వాత ఫీల్డింగ్లో కొన్ని కీలక క్యాచ్లు అందుకున్న సంజూ.. అంతకుముందు తొలి ఓవర్లోనే లంక ఓపెనర్ నిస్సంక ఇచ్చిన క్యాచ్ను జారవిడిచాడు. ఇది చూసిన చాలా మంది లేక లేక వచ్చిన అవకాశాలను ఇలా చేజార్చుకుంటారా? అంటూ సంజూను తిట్టిపోశారు. ఆ తర్వాత బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే సమయంలో సంజూ ఎడమ మోకాలికి గాయమైంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ అనంతరం అతనికి విశ్రాంతి అవసరం అని వైద్యులు తేల్చిచెప్పారు.
వైద్యలు సూచన మేరకు అతన్ని మిగతా టీ20ల నుంచి తప్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో విదర్భ వికెట్ కీపింగ్ బ్యాటర్ జితేశ్ శర్మను టీమిండియాకు ఎంపిక చేసింది. ఈ విషయంపై సంజూ శాంసన్ తాజాగా స్పందించాడు. అంతా బాగానే ఉందన్న సంజూ.. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగుతానంటూ పోస్టు పెట్టాడు. ఇన్స్టాగ్రాంలో ఫొటో షేర్ చేసిన అతను 'ఆల్ ఈజ్ వెల్.. సీ యూ సూన్' అని పోస్టు పెట్టాడు. దీనిపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ వెంటనే స్పందించాడు. 'త్వరగా కోలుకోవాలి బ్రో' (గెట్ వెల్ సూన్ బ్రో) అని కామెంట్ చేశాడు.