
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ షేర్ చేసిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ను సంజూ కలిశాడు. తను ఎంతో అభిమానించే హీరోను కలవడంతో సంజూ చాలా సంతోషించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసుకున్నాడు. అతని ఫ్యాన్ పేజ్ కూడా రజినీని సంజూ కలిసిన వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికి సంజూ శాంసన్ కోరిక తీరిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రజినీకాంత్తో ఉన్న ఫొటోను షేర్ చేసిన సంజూ.. దాంతోపాటు తనకు ఈ క్షణం ఎంత ముఖ్యమో కూడా వివరించాడు. 'నాకు ఏడేళ్ల వయసున్నప్పటి నుంచే నేను రజినీ సార్కు పెద్ద ఫ్యాన్. అప్పుడే మా అమ్మానాన్నకు చెప్పా.. ఎప్పటికైనా నేను రజినీ సార్ను ఆయన ఇంట్లోనే కలిసి తీరతాను అని. ఇదిగో 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కోరిక తీరింది. తలైవర్ నన్ను ఆయన ఇంటికి ఆహ్వానించారు' అని సంజూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో సంజూ ఆడాడు. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూ మోకాలికి గాయమైంది. దీంతో అతను ఆ సిరీస్తోపాటు జట్టుకూ దూరమయ్యాడు. అప్పటి నుంచి మళ్లీ అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు. ప్రస్తుతం వన్డే, టీ20ల్లో భారత జట్టులో సంజూకు స్థానం దక్కడం చాలా కష్టంగా కనిపిస్తోంది. మరి వన్డే వరల్డ్ కప్ నాటికి అతన్ని ఫినిషర్గా తీర్చిదిద్దాలని అనుకున్న బీసీసీఐ ప్లాన్ ఏమైందో తెలియడం లేదు. అయితే మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ సారధిగా సంజూ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు.