వన్డే ప్రపంచకప్ ముందు సంజు శాంసన్కు టీ20ల్లో ఛాన్స్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ మరికొన్ని నెలల్లో జరగనుండగా ఇప్పుడు అతడికి వన్డేల్లో అవకాశాలు ఇస్తున్నారు. సెలక్టర్ల ప్లాన్ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ సంజు శాంసన్ మాత్రం తన పని తాను చేసుకొని వెళ్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించాడు. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో చెలరేగి టీమిండియాకు వన్డే సిరీస్ అందించాడు.
అయితే ఈ క్రమంలో సంజు శాంసన్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో కనీసం 500కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో 50కు పైగా సగటుతో పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ మాత్రమే ఉన్నారు. అలాగే సంజు శాంసన్ మరో చరిత్రాత్మక రికార్డులో భాగమయ్యాడు.

శాంసన్ సెంచరీతో ఈ ఏడాది వన్డేల్లో టీమిండియా తరపున 19 శతకాలు నమోదయ్యాయి. దీంతో చారిత్రక రికార్డు సమం అయింది. ఓ ఏడాదిలో వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా టీమిండియా మూడోసారి చరిత్రను లిఖించింది. ఈ జాబితాలో తొలి అయిదు స్థానాల్లో మనమే మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం.
2017లో భారత ప్లేయర్లు 207 ఇన్నింగ్స్ల్లో 19 సెంచరీలు చేయడమే టాప్. ఇప్పుడు శాంసన్ సెంచరీతో ఈ రికార్డు సమం అయింది. ఈ ఏడాది 269 ఇన్నింగ్స్ల్లో 19 సెంచరీలు నమోదయ్యాయి. ఇక మూడో స్థానంలో కూడా భారత్ ఉంది. 1998లో టీమిండియా తరపున 18 రికార్డులు నమోదయ్యాయి. ఇక నాలుగు, అయిదు స్థానాల్లో దక్షిణాఫ్రికా ఉంది. 2015, 2023లో సఫారీ బ్యాటర్లు వన్డేల్లో 18 సెంచరీలు బాదారు. కాగా, తన కెరీర్లో సంజు శాంసన్కు ఇది తొలి శతకం కావడం విశేషం.