Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్కు సంబంధించి ఆందోళన కలిగించే వార్తలు వెలుగులోకి వచ్చాయి. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు సంజు శాంసన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ వార్త అభిమానులలో, భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఏం జరిగింది?
"కేరళక్రికెట్ లీగ్ (KCL)"లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంజు శాంసన్, ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రిలో ఉన్నారని ఆయన భార్య చారులత రమేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అదే రోజు రాత్రి 7:45 గంటలకు సంజూ శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ మ్యాచ్లో పాల్గొన్నారు. ఇది అభిమానులలో ఆందోళనను రేకెత్తించింది. మ్యాచ్లో సంజు శాంసన్ మైదానంలో ఉండడం, ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించినప్పటికీ, ఆసుపత్రికి వెళ్లడానికి గల కారణంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి.

ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ మ్యాచ్ ఆడిన శాంసన్
ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ, సంజు శాంసన్ తన బాధ్యతను నిర్వర్తించారు. కేసీఎల్ 2025లో అదానీ త్రివేండ్రం రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ జట్టు కొచ్చి బ్లూ టైగర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శాంసన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, ఈ నెల ప్రారంభంలో గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఒక ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్లో సంజు 36 బంతుల్లో 54 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు.
ఆసియా కప్కు ముందు ఆందోళనలు
సంజు శాంసన్ ఆస్పత్రిలో ఎందుకు చేరారనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఒకవేళ అతని గాయం తీవ్రమైనదే అయితే అది టీమిండియాకు, సెలెక్టర్లకు ఒక సమస్యగా మారవచ్చు. ఆసియా కప్లో సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అతని ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడం జట్టు ప్రణాళికలను ప్రభావితం చేయవచ్చు.