IND vs NZ: టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్కు ముందు లభించిన అద్భుతమైన అవకాశాలను సంజూ చేజార్చుకుంటున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్లో సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన అభిమానులను నిరాశపరచడమే కాకుండా.. జట్టులో సంజూ శాంసన్ స్థానంపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.
సిరీస్ మొత్తం చేతులెత్తేసిన సంజూ శాంసన్
ఓపెనర్గా బరిలోకి దిగుతున్న సంజూ శాంసన్.. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. సంజూ శాంసన్ స్కోర్లు వరుసగా 10,8,0, 24 మాత్రమే చేశాడు. ముఖ్యంగా నాలుగో మ్యాచ్లో క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినప్పటికీ.. భారీ స్కోరు చేయలేకపోయాడు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్పై నమ్మకంతో శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టినప్పటికీ.. సంజూ శాంసన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు.

రేసులోకి దూసుకొస్తున్న ఇషాన్ కిషన్
ఓ వైపు సంజూ విఫలమవుతుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తూ తన పట్టు బిగిస్తున్నాడు. సంజూ శాంసన్ షాట్ సెలక్షన్, ఒత్తిడిలో ఆడే తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సంజూ శాంసన్ తన ఫామ్ అందుకోలేకపోతే రాబోయే వరల్డ్ కప్లో అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాత్రం సంజూను సమర్థించారు. సంజూ ఓ పెద్ద ఇన్నింగ్స్కు కేవలం అడుగు దూరంలో ఉన్నాడని.. అతను త్వరలోనే ఫామ్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు.
తిరువనంతపురంలో 'కరో యా మరో' పోరు
సిరీస్లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఇది సంజూ శాంసన్కు సొంత మైదానం కావడం విశేషం. విమర్శకులకు సమాధానం చెప్పడానికి, వరల్డ్ కప్ జట్టులో తన చోటును సుస్థిరం చేసుకోవడానికి ఇది అతనికి చివరి అవకాశం. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న మెగా ఈవెంట్ కోసం సెలక్టర్లు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేరళ స్టార్ బ్యాటర్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో వేచి చూడాలి.