
హైదరాబాద్: సంజూ శాంసన్ క్రికెట్ కెరీర్కు ఇదొక దుష్పరిణామం. ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్థాన్ జట్టులో మెరుగ్గానే రాణించి.. భారత -ఏ జట్టులో చోటు సంపాదించాడు వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ సంజు శాంసన్. కానీ, అనుకున్నది జరగలేదు. ప్రతి క్రికెటర్ తప్పకుండా పాసవ్వాల్సిన యోయో టెస్టులో ఫెయిలవడంతో మున్ముందు ఆడబోయే మ్యాచ్ల నుంచి అతణ్ని తప్పించినట్లు సమాచారం.
ఇటీవలే బీసీసీఐ యో-యో ఫిట్నెస్ టెస్టు నిర్వహించింది. దీని ఫలితం ఆధారంగానే త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటన నుంచి శాంసన్ను తప్పించినట్లు తెలుస్తోంది. జూన్ 17 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఓ ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లాండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు.
క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో భారత్- ఏ జట్టుతో కలిసి తాజాగా ఇంగ్లాండ్కి వెళ్లకుండా అతను ఇండియాలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. భారత - ఏ జట్టుకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. జట్టులో పృథ్వీ షా, శుభమన్ గిల్, రిషబ్ పంత్ తదితర యువ క్రికెటర్లకీ చోటు దక్కింది.
తాజాగా సంజు శాంసన్ జట్టు నుంచి పక్కకి వెళ్లడంతో.. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఆడిన సంజు శాంసన్ మిడిలార్డర్లో బాధ్యతాయుత ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. అంతకముందే దేశవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా మెరుగ్గా రాణించడంతో అతడికి సెలక్టర్లు అవకాశం కల్పించారు. భారత్ తరఫున ఆడాలంటే.. సదరు క్రికెటర్ యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవడం తప్పనిసరి అనే నిబంధన.. గతేడాది నుంచి కొనసాగుతోంది.
ప్రస్తుత భారత్ ఏ జట్టుకు కోచ్గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కోచ్గా వ్యవహరించి వరల్డ్ కప్ సాధించిన జట్టులోని ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి భారత్ ఏ జట్టును సిద్ధం చేస్తున్నారు.