రిషబ్ పంత్కు క్లాస్ పీకిన గోయెంకా.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో ఘోర పరాజయం పాలైన తర్వాత మైదానంలోనే జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య జరిగిన చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకాకు, తన జట్టు కెప్టెన్లకు మధ్య ఎందుకు పడటం లేదనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
స్టేడియంలో యానిమేటెడ్ చర్చ.. ఏం జరిగింది?
ఢిల్లీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్తో సీరియస్గా మాట్లాడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఆ చర్చ చాలా యానిమేటెడ్గా సాగుతున్నట్లు అనిపించింది. గతేడాది కూడా రిషబ్ పంత్ విషయంలో అంతకు ముందు కేఎల్ రాహుల్ విషయంలో సంజీవ్ గోయెంకా ఇలాగే ప్రవర్తించడం అభిమానులకు గుర్తుకొస్తోంది.

ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించిన వైనం
లక్నో యజమాని సంజీవ్ గోయెంకాకు కెప్టెన్లతో విభేదాలు ఈనాటివి కావు. 2016లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ యజమానిగా ఉన్నప్పుడు.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో జట్టు 7వ స్థానంలో నిలిచింది. దీంతో 2017 సీజన్ ప్రారంభానికి ముందే సంజీవ్ గోయెంకా ఎవరూ ఊహించని విధంగా ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించి స్టీవ్ స్మిత్కు బాధ్యతలు అప్పగించాడు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. సంజీవ్ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా "స్మిత్ అడవికి రాజు అని నిరూపించుకున్నాడు.. అతను ధోనీ కంటే మెరుగైనవాడు" అని చేసిన ట్వీట్ ధోనీ అభిమానులను తీవ్రంగా గాయపరిచింది.
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా
2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఘోరంగా ఓడిపోయినప్పుడు.. సంజీవ్ గోయెంకా మైదానంలోనే అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ను అందరి ముందు మందలించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంజీవ్ గోయెంకాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేఎల్ రాహుల్ను తన నివాసానికి డిన్నర్కు పిలిచి సయోధ్య కుదుర్చుకున్నట్లు కనిపించినా.. 2025 వేలంలో కేఎల్ రాహుల్ను జట్టు వదిలేయడం గమనార్హం.
రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి?
2025 వేలంలో రూ.27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది. కానీ రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2025లో జట్టు 7వ స్థానానికే పరిమితమైంది. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఓపెనర్గా వచ్చి కేవలం 7 పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. ఈ వైఫల్యమే గోయెంకా అసహనానికి కారణమని తెలుస్తోంది.
ఓటమి అనంతరం సంజీవ్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా "జట్టుపై నాకు నమ్మకం ఉంది.. మేము తిరిగి పుంజుకుంటాం" అని శాంతంగా స్పందించినప్పటికీ.. మైదానంలో ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం భిన్నంగా ఉంది. కెప్టెన్లపై ఒత్తిడి పెంచడం సంజీవ్ గోయెంకా శైలీనా? లేక జట్టు ప్రయోజనాల కోసం ఆయన పడే ఆరాటమా? అనేది కాలమే నిర్ణయించాయి. రిషబ్ పంత్ తన తర్వాతి మ్యాచ్ల్లో రాణించకపోతే లక్నోలో మళ్లీ కెప్టెన్ మార్పు సంభవించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications