IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇటీవలే వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించగా... ఈజీగా గెలవాల్సిన మ్యాచులో లక్నో ఓడిపోయింది. ముఖ్యంగా లక్నో కెప్టెన్ పంత్ విఫలమైయ్యాడు. పరుగులు కూడా చేయకుండా వెనుదిరిగాడు. అయితే మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా.. మైదానంలో పంత్ తో కలిసి ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపించాడు. ఈ క్రమంలోనే గతేడాది కేఎల్ రాహుల్ తో సంజీవ్ గోయెంకా మైదానంలో సీరియస్ గా ప్రవర్తించిన సంఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం.. ఫ్రాంఛైజీ ఓనర్లు తమ జట్టు కెప్టెన్లపై, ఆటగాళ్లపై కోపం ప్రదర్శించొచ్చా? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
ఈ సీజన్ కోసం సంజీవ్ గోయెంకా.. పంత్ ను ఐపీఎల్ చరిత్రలోనే రూ.27 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేశాడు. అతడిని తమ జట్టుకు కెప్టెన్ గానూ ఎంపిక చేశాడు. కానీ పంత్ తొలి మ్యాచులోనే తేలిపోయాడు. ఆరు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు.

అప్పుడూ కూడా అంతే...
అయితే మ్యాచ్ తర్వాత పంత్.. సంజీవ్ గోయెంకా ఏదో చర్చించుకున్నట్లుగా కనిపించింది. పైగా సంజీవ్ గోయెంకా జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు అనిపించింది. అయితే, లక్నో జట్టు ఓటమి చెందాక సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్తో కాస్త సీరియస్ గా మాట్లాడటం ఇదేం తొలిసారి కాదు. గత సీజన్ లోనూ అప్పుడు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్తో.. మ్యాచు ఓడిపోయిన సమయంలో మైదానంలోనే కాస్త కోపంగా మాట్లాడాడు. ఆ తర్వాత రాహుల్.. లక్నో నుంచి బయటకు వచ్చేయడం, మెగా వేలంలో రిషభ్ పంత్ ను రూ. 27 కోట్లకు లక్నో కొనుగోలు చేసి, సారథ్య బాధ్యతలు అప్పగించడం జరిగింది.
రూల్స్ ఏం చెబుతున్నాయి..
అయితే రూల్స్ ప్రకారం చూస్తే.. ఫ్రాంఛైజీ ఓనర్స్ తమ జట్లను ఎలా నడిపించాలి, ఆదాయంలో వాటాను ఎలా షేర్ చేయాలి, పొందాలి వంటి నియమాలను నిర్దేశించింది ఐపీఎల్. కానీ ఫ్రాంఛైజీ యజమానులు.. ఆటగాళ్లతో ఎలా మాట్లాడాలనే దానిపై స్పష్టతమైన నియమాలు ఏమీ పెట్టలేదు. కానీ ఓనర్స్ లేదా ఆటగాళ్లు ఒకరినొకరితో ప్రొఫెషనల్ గా వ్యవహరించాలి. IPL ఫ్రాంఛైజీ యజమానులు తమ ఆటగాళ్ల ప్రదర్శనతో నిరాశ లేదా అసంతృప్తి చెందొచ్చు కానీ.. మ్యాచ్ సమయంలో మైదానంలోకి వచ్చి నేరుగా ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం అనుచితమైనది. అది అన్ ప్రొఫెషనల్ అవుతుంది. ఐపీఎల్ అనే ఓ ప్రొఫెషనల్ లీగ్. ఆటగాళ్లు -ఓనర్స మధ్య చర్చలు ఉండాలి, అయితే అది జట్టుకు ఉపయోగకరంగా ఉండాలి. అంతేకానీ బహిరంగంగా ఆటగాళ్లపై ఫ్రస్టేషన్ ప్రదర్శిస్తే అది జట్టు ఇమేజ్ ను దెబ్బతీస్తుంది.