Sanjiv Goenka: సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ పూర్తిగా లక్నో చేతుల్లోనే ఉంది.. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ విస్పోటక బ్యాటింగ్ ముందు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు తేలిపోయారు. ఢిల్లీ తరఫున చివరి ఓవర్ లో అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. లక్నో ఓటమి అనంతరం ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో కలిసి మైదానంలో కనిపించాడు. వారితో పాటు లక్నో కోచ్ జస్టిస్ లాంగర్ కూడా అక్కడ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్ కు సంజీవ్ గోయెంకా వార్నింగ్ ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పంత్-గోయెంకా ఫోటోలు పెట్టి రిషబ్ పంత్ కు స్టార్ట్ అయ్యిందంటూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా దగ్గరకు ఏ కెప్టెన్ వెళ్లినా అవమానం ఎదుర్కొంటారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో రిషబ్ పంత్ లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాకు ఏదో వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో లో రిషబ్ పంత్ సీరియస్ నెస్ చూస్తుంటే సంజీవ్ గోయెంకా జట్టు ప్రదర్శన పట్ల పెద్దగా సంతోషంగా లేడని అనిపిస్తోంది. అయితే లక్నో ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్తో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.ఐపీఎల్ 2024లో సంజీవ్ గోయెంకా అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. గతేడాది సీజన్ లో మ్యాచ్ ఓడిన తర్వాత కేఎల్ రాహుల్ ను పిలిచి దురుసుగా మాట్లాడిన విషయం అందరికీ గుర్తుండిపోయింది. ఆ తర్వాత లక్నో జట్టు నుంచి బయటకు వచ్చిన రాహుల్.. ఢిల్లీలో కెప్టెన్సీ అవకాశం వచ్చిన తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దీనిన బట్టి చూస్తే సంజీవ్ ప్రభావం కేఎల్ రాహుల్ పై ఎంతలా పడిందో తెలుస్తోంది.

మైదానంలోనే కేఎల్ రాహుల్ ను తిట్టిన సంజీవ్ గోయెంకా
ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) లక్నో సూపర్ జెయింట్స్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఘోర ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ను అందరి ముందు తిట్టాడు. దీని అనంతరం చాలా గొడవ జరిగింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో జట్టు నుంచి కేఎల్ రాహుల్ బయటకు వచ్చేశాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాయి. అయితే కేఎల్ రాహుల్ తన కుమార్తె పుట్టడం వల్ల తమ మాజీ ఫ్రాంచైజీతో ఆడలేకపోయాడు.
రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ను కొనుగోలు చేయడానికి రూ.27 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. కానీ రిషబ్ పంత్ ఫ్రాంచైజీ తరపున తన తొలి మ్యాచ్ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అనుకోలేదు. ఢిల్లీతో మ్యాచ్ లో 6 బంతులు ఆడిన రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్సీలో కూడా పంత్ కూడా కొన్ని తప్పులు చేశాడు. చివరి ఓవర్ లో మోహిత్ శర్మ స్టంపింగ్ ను కూడా మిస్ అయ్యాడు. లక్నో జట్టు తదుపరి మ్యాచ్ మార్చి 27న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది.