
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇటీవలి సంవత్సరాలలో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ టీంపై ఆదిపత్యం చెలాయిస్తోంది అని భారత మాజీ బ్యాట్స్మన్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఎప్పటికైనా సీఎస్కేకు ముంబై నుంచి ప్రమాదం పొంచి ఉంటుందన్నాడు. లీగ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చాలా బలమైన జట్లు అన్న సంగతి తెలిసిందే. 12 సంవత్సరాల లీగ్ చరిత్రలో 8 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరుకున్న చెన్నై 3 టైటిల్స్ గెలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 ఫైనలల్లో 4 టైటిల్స్ గెలుచుకుంది.
2029 ఐపీఎల్ ఫైనల్ కూడా ఈ చెన్నై, ముంబై జట్ల మధ్యే జరిగింది. ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో కేవలం ఒకే ఒక్క పరుగుతో చెన్నైపై ముంబై విజయం సాధించింది. దీంతో లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై నిలిచింది.స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'ఐపీఎల్లో ఇటీవలి ఫలితాలను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్పై ఆధిపత్యం చెలాయిస్తోంది. 12 సంవత్సరాలుగా ఐపీఎల్ను పరిశీలిస్తే.. కొన్ని జట్ల విజయాల శాతం పెరుగుతూ వస్తోంది. చెన్నై అక్కడే ఉన్నా.. ముంబై టైటిల్స్ గెలుస్తూ వస్తోంది' అని అన్నాడు.
'టోర్నీని నాలుగుసార్లు ముంబై, మూడుసార్లు చెన్నై గెలుపొంది. అయితే ముంబై ఫైనల్స్ మాత్రం తక్కువగా ఆడింది. గత కొద్ది సంవత్సరాలుగా చెన్నై జోరుకి ముంబై అడ్డుకట్ట వేస్తోంది. నిజానికి చెన్నై కంటే ముంబై మెరుగ్గా కన్పిస్తోంది. ఈ రెండు జట్లు మళ్లీ ఫైనల్లోకి అడుగుపెడితే కచ్చితంగా ముంబైనే విజయం సాధించే అవకాశముంది' అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ముంబై గెలిచిన నాలుగు టైటిళ్లలో మూడుసార్లు.. చెన్నైపైనే గెలవడం విశేషం. ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్ ముంబై-చెన్నై జట్ల మధ్య జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని గతనెల 29 నుంచి ఈనెల 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ సందేహాలు నెలకొన్నాయి.
సంజయ్ మంజ్రేకర్కు ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి మంజ్రేకర్ను బీసీసీఐ తొలగించింది. సంజయ్ మంజ్రేకర్ని తొలగించడానికి గల అసలు కారణాలు తెలియరాలేదు. కానీ.. బీసీసీఐ అధికారులకు అతని పనితీరు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 54 ఏళ్ల ఈ క్రికెటర్ భారతదేశం తరఫున 111 అంతర్జాతీయ మ్యాచ్లు (37 వన్డేలు, 74 టెస్టులు) ఆడాడు. 1996లో క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వ్యాఖ్యానం మొదలుపెట్టాడు.