
డేంజర్ జోన్లో ధావన్:
సంజయ్ మంజ్రేకర్ తాజాగా ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. టీమిండియా ఓపెనింగ్ జోడీపై స్పందించాడు. 'ఎప్పుడైనా భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఓపెనర్గా కచ్చితంగా ఉంటాడు. మూడో టీ20కి రోహిత్ జట్టులోకి వస్తుండడం భారత క్రికెట్కు శుభవార్త. అయితే మితవారిపైనా కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. వారు ప్రతి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయాలి. ఇప్పటి పరిస్థితుల దృష్యా చూసుకుంటే శిఖర్ ధావన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో గబ్బర్ ఒక అడుగు వెనుకపడినట్లే' అని మంజ్రేకర్ అన్నాడు.

మ్యూజికల్ చైర్లా ఉంది:
'ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. అతడిని ఇప్పుడు పక్కకు తప్పించే అవకాశాలు లేవు. లోకేష్ రాహుల్ రెండేళ్లుగా టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. అతడు ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతని గురించి ఎక్కువ ఆలోచించనవసరం లేదు. శిఖర్ ధావన్ విషయంలోనే కాస్త ఆందోళన ఉంది. అతను మొదట్నుంచి ఓపెనింగ్ స్థానంలోనే బ్యాటింగ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఫామ్ కోల్పోయాడు. మొదటి రెండు టీ20లకు దూరమైన రోహిత్ మూడో టీ20లో కచ్చితంగా ఆడుతాడు. అలా చూసుకుంటే గబ్బర్ రేసు నుంచి వెనుకబడ్డట్లే. ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్ మ్యూజికల్ చైర్లా ఉంది' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.

జట్టులో ప్రయోగాలు:
రానున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా మేనేజ్మెంట్.. జట్టులో పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో చాలామంది ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ కూడా ఓపెనర్ స్థానానికి పోటీలో ఉండడం.. ఇదివరకు టీమిండియా ఓపెనర్గా సత్తా చాటిన శిఖర్ ధావన్తో పాటు తాజాగా ఇషాన్ కిషన్ వచ్చి చేరాడు. దీంతో రెగ్యులర్ రోహిత్ శర్మతో ఎవరిని ఓపెనింగ్ ఆడించాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఏదేమైనా మూడో టీ20లో మాత్రం ఇషాన్ ఓపెనర్గా రానున్నాడు.

భారత తుది జట్టు (అంచనా):
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్.


Click it and Unblock the Notifications
