
చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే అని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో అతడి కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు ఎంపికపై మాజీలు కొందరు మండిపడ్డారు. రవిచంద్రన్ అశ్విన్కు అండగా రాణించడంలో షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ విఫలమయ్యారు. నదీమ్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. ఇంగ్లండ్ బ్యాట్స్మన్పై ఏమాత్రం ఒత్తిడి తేలేకపోయాడు. దీంతో కుల్దీప్ యాదవ్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా సంస్థతో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్ తొలి టెస్టులో జట్టు ఎంపిక, భారత్ వ్యూహాలు సరైనవేనని చెప్పాడు. అయితే ఆన్ఫీల్డ్లో బౌలింగ్ విషయంలో విరాట్ కోహ్లీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే సరిగ్గాలేవన్నాడు. 'భారత్ వ్యూహాల్లో తప్పులు ఉన్నాయని నేను చెప్పను. జట్టు ఎంపిక కూడా సరైనదేనని భావిస్తున్నా. అయితే, ఈ మ్యాచ్లో షాబాజ్ నదీమ్ సరిగ్గా బౌలింగ్ చేయకపోయేసరికి అంతా కుల్దీప్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ పిచ్ అతడికి కొట్టిన పిండి' అని అన్నాడు.
'సుందర్ సరైన లైన్లో బౌలింగ్ చేసి ఆకట్టుకోలేదు. ఆఫ్స్టంప్ అవతల బంతులేయడంలో అతడు మేటి బౌలర్. అలా బౌలింగ్ చేసిన సందర్భంలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. అయితే ఇక్కడే విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టం' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో అజింక్య రహానే.. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలుపొందడంతో కోహ్లీ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగింది.
శనివారం నుంచి చెపాక్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలంటే కోహ్లీసేన ఈ సిరీసులో ఇకపై ఏ మ్యాచూ ఓడిపోకూడదు. రెండో టెస్ట్ కోసం చెపాక్లో కొత్త పిచ్ను సిద్ధం చేశారు. బహుశా తొలి రోజు నుంచే బంతి టర్న్ అవుతుందని అంచనా వేస్తున్నారు. భారత జట్టులోనూ మార్పులు ఉండనున్నాయి. అక్షర్ పటేల్ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమే. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అతడు వస్తున్నాడు. షాబాజ్ నదీమ్కు మరో అవకాశమే లేదు. వాషింగ్టన్ సుందర్నూ తిరిగి తీసుకోవడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకున్నా ఆశ్చర్యం లేదు! స్పిన్ పిచ్ కావడంతో మరో స్పెషలిస్టు పేసర్ బదులు అతడి సేవలు వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.