ట్విట్టర్లో స్పందించిన మంజ్రేకర్:
సంజయ్ మంజ్రేకర్పై వేటుకు కారణాలు కచ్చితంగా తెలియకున్నా.. అతడి శైలిపై బీసీసీఐ సంతృప్తిగా లేదని సమాచారం. మంజ్రేకర్పై వేటు అని వార్తలు వస్తున్నా.. అధికారిక సమాచారం ఏదీ లేదు. అయితే ఈ వార్తలపై మంజ్రేకర్ స్వయంగా స్పందించాడు. తనను బీసీసీఐ తొలగించిన విషయం వాస్తవమేనని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన మంజ్రేకర్.. బీసీసీఐ నిర్ణయాన్ని పక్కా ప్రొఫెషనల్గా అంగీకరిస్తున్నానని తెలిపాడు.
|
బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తా:
'కామెంట్రీని నా అర్హతగా, నాకు దక్కిన గౌరవంగా భావించాను. అదో ఉపాధి అవకాశం అని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను కొనసాగించాలో, వద్దో అనేది నన్ను నియమించుకున్న సంస్థకు చెందిన విషయం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. నా పనితీరు బీసీసీఐకి నచ్చలేదేమో.. ఓ ప్రొఫెషనల్గా దీన్ని అంగీకరిస్తున్నా' అంటూ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
జడేజా, భోగ్లే, ధోనీ, సానియాలపై :
సంజయ్ మంజ్రేకర్ కామెంట్రీపై గత రెండేళ్లుగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా తాను రవీంద్ర జడేజా వంటి 'బిట్స్ అండ్ పీసెస్' క్రికెటర్లకు అభిమానిని కాదన్నాడు. 2018 ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ని మతిలేని ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత పలు సందర్భాల్లో హర్షాభోగ్లే, ఎంఎస్ ధోనీ, సానియా మిర్జాలను ఇలాగే అవమానించే ప్రయత్నం చేసి నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అతని తీరు నచ్చక కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిందని సమాచారం.
సీఎస్కే కౌంటర్:
సంజయ్ మంజ్రేకర్ను బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిందనే వార్తల నేపథ్యంలో ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్పందించింది. ఇకపై 'బిట్స్ అండ్ పీసెస్' గొంతు వినాల్సిన పనిలేదని మంజ్రేకర్ను ఉద్దేశించి ట్రోల్ చేసింది. గత ఏడాది రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో.. తమ ఆటగాడికి బదులుగా చెన్నై ట్వీట్తో కౌంటర్ ఇచ్చింది. జడేజా సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.