
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోని. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్లు అందించిన ఏకైక కెప్టెన్గా, ప్రపంచంలో అత్యుత్తమ బెస్ట్ ఫినిషర్గా భారత్కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలను అందించాడు. సచిన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకడిగా కూడా గుర్తింపు పొందాడు.
అయితే ఇటీవల భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సిరిస్ ధోని ఆటతీరు విమర్శలకు తావిచ్చింది. టీ20ల నుంచి ధోని తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్లు విమర్శించేలా చేసింది. ధోని పని అయిపోయిందని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సలహా ఇచ్చారు.
తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ధోనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 'క్రికెట్ హీరోలను దేవుళ్లుగా ఆరాధిస్తున్నాం. ఇది భారత డీఎన్ఏలోనే ఉందా..? క్రికెట్లో ఇప్పటికే ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి ధోనీ మరేదో అవుతాడు' అని ధోనిని ఉద్దేశించి సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
'ప్రతిష్ట లేదా స్థాయి కారణంగా ఆటగాణ్ని జట్టులోకి ఎంపిక చేయొద్దు. ప్రతి ఆటగాడి విషయంలో ఒకే విధానం అనుసరించాలి. గతంలో బాగా రాణించడం, క్వాలిటీ లాంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు నైపుణ్యాలు, ఫిట్నెస్, జట్టులో ఇమిడిపోయే తత్వం, నిలకడగా ఆడటం లాంటి అంశాలనే నేను పరిగణనలోకి తీసుకుంటా' అని అన్నాడు.
'ఈ మధ్య కాలంలో మైదానంలో ధోని ఆటతీరు పరిశీలిస్తే.. గతంలో మాదిరిగా గేమ్ ఛేంజర్ కాదు. గొప్ప ఆటగాడు మన అంచనాలను అందుకోకపోతే తప్పించడం కూడా సరికాదా?' అని ప్రశ్నించాడు. అంతేకాదు గొప్ప ఆటగాళ్ల గురించి మంచి విషయాలే ప్రస్తావించాలా? అంటూ మండిపడ్డాడు.
గతంలో కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ విషయంలోనూ ఇలాగే జరిగిందని మంజ్రేకర్ అన్నాడు. కపిల్ తన చివరి 24 ఇన్నింగ్స్ల్లో 26 వికెట్లు మాత్రమే తీశాడు. అతణ్ని తప్పించడం వల్ల జవగళ్ శ్రీనాథ్ లాంటి యువ క్రికెటర్ వెలుగులోకి వచ్చాడని మంజ్రేకర్ తెలిపాడు.
ఇక సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే తన చివరి 25 టెస్టు ఇన్నింగ్స్లో యావరేజి 27 మాత్రమే నమోదు చేశాడని అన్నాడు.