
49 బంతుల్లో 67 పరుగులు:
శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన పోరులో కోల్కతా నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. వెంకటేశ్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఈ మ్యాచులో బెదురు లేని బ్యాటింగ్తో వెంకటేశ్ అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. అనుభవజ్ఞులైన పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దాంతో హీరో అయ్యాడు. అంతేకాదు ఐపీఎల్కు సరిపోయే విధ్వంసక బ్యాట్స్మన్గా పేరుతెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2021 రెండో దశ ఆరంభం నుంచి అభిమానులతో పాటు మాజీలను తన బ్యాటింగ్తో వెంకటేశ్ అలరిస్తున్నాడు.

12-14 కోట్ల ధర పలుకుతాడు:
తాజాగా సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... 'వచ్చే ఐపీఎల్ (ఐపీఎల్ 2022) వేలంలో వెంకటేశ్ అయ్యర్ రూ.12-14 కోట్ల ధర పలుకుతాడని నేను అంచనా వేస్తున్నా. ఇప్పుడు అతడు అనుకోకుండా బాగా ఆడుతున్నాడని నేను ఇలా చెప్పట్లేదు. వెంకటేశ్ దేశవాళీ గణాంకాలు చూశాను. ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 47 సగటుతో 92 స్ట్రైక్రేట్ అతడు కలిగి ఉన్నాడు. ఇది కేవలం దేశవాళీ టీ20 క్రికెట్ గణంకాలు మాత్రమే. ఇందులో ఐపీఎల్ మ్యాచులను పరిగణలోకి తీసుకోలేదు. వీటిని బట్టే వెంకటేశ్ అయ్యర్ ఎలా ఆడతాడో అర్ధం చేసుకోవచ్చు' అని అన్నాడు.

గేమ్ ఛేంజర్గా కొనసాగుతాడు:
'బ్యాటింగ్ ఎలా చేయాలో వెంకటేశ్ అయ్యర్కు బాగా తెలుసు. పరిస్థితులకు తగ్గట్టు కూడా అడగలడు. మరోవైపు అతడు బౌలర్గానూ పనికొస్తాడు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కీలక ఓవర్లు బౌలింగ్ చేసి ఆ సత్తాచాటాడు. దీంతో వచ్చే వేలంలో భారీ ధర పలుకుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు ఇదొక్క సీజన్లోనే కాకుండా చాలా కాలం గేమ్ ఛేంజర్గా కొనసాగుతాడు. తన ఫుట్వర్క్ బాగుంది. అన్ని రకాల షాట్లూ ఆడగలడు. అతడిపై నాకు నమ్మకం ఉంది. మంచి ప్లేయర్ అవుతాడు' అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

చదువును కొనసాగిస్తూనే:
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వెంకటేశ్ అయ్యర్ 2015 నుంచి రాష్ట్ర స్థాయి జట్టులో కొనసాగుతున్నాడు. అదే సమయంలో ఎంబీఏ పూర్తి చేశాడు. అంతకుముందు ఛార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ఆశించిన అతడు.. ఆ కోర్సులో చేరితే క్రికెట్కు దూరమవ్వాల్సి వస్తుందని ఆలోచించాడు. దీంతో ఎంబీఏలో చేరాడు. మెరిట్ విద్యార్థి అయిన అతడు.. తనపై ఉన్న ఆత్మవిశ్వాసంతో తరగతులకు కూడా ఎక్కువగా హాజరయ్యేవాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్ ఆట చూసి ఫిదా అయిన అధ్యాపకులు అతడికి సాయం చేశారు. నోట్సు తయారు చేసివ్వడం, అటెండెన్స్ నష్టపోకుండా చూడటం లాంటివి చేశారు. దీంతో మిగిలిన సమయమంతా ప్రాక్టీస్కే కేటాయించిన వెంకటేశ్.. క్రికెట్లో మంచి ఆల్రౌండర్గా తయారయ్యాడు. అలా చదువును కొనసాగిస్తూనే క్రికెటర్గా ఎదిగాడు.

డెలాయిట్లో ఉద్యోగం వదులుకుని:
26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ ఎంబీయే పూర్తి చేశాక డెలాయిట్ సంస్థలో మంచి ఉద్యోగం సంపాదించాడు. అయినా దాన్ని వదులుకొని క్రికెటర్గా కొనసాగేందుకే సిద్ధపడ్డాడు. అదే సమయంలో 2018లో తొలిసారి ఫస్ట్క్లాస్ క్రికెటర్గా ఎంపికై దాదాపు మూడేళ్లు ఎంతో కష్టపడ్డాడు. మధ్యప్రదేశ్ జట్టులో అండర్ 23 జట్టుకు కెప్టెన్గానూ పని చేశాడు. ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకొని ఐపీఎల్ 2020లో తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికయ్యాడు. అయితే అతడికి ఆ సీజన్లో ఆడే అవకాశాలు రాలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు వెంకటేశ్.. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో చెలరేగాడు. తొలుత సయ్యద్ ముస్తాక్ టోర్నీలో ఐదు మ్యాచ్ల్లో 75.66 సగటుతో 277 పరుగులు చేసి టాప్లో నిలిచాడు. విజయ్ హజారేలో పంజాబ్పై 198 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్కు ఎంపియ్యాడు. తొలి దశలో ఆడే అవకాశం రాకున్నా.. రెండో దశలో అదృష్టం వరించి హీరో అయ్యాడు.


Click it and Unblock the Notifications












